పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు దేనికి? ఒకే దేశం, ఒకే ఎన్నిక (1) నినాదాన్ని సాకారం చేయడానికి అని బీజేపీ సంగతి తెలిసినవారు వేస్తున్న అంచనా.. సమావేశాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్యేక సమావేశాలకు కారణమేంటన్న దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం వన్ నేషన్- వన్ ఎలక్షన్ నినాదాన్ని ముందుకు తీసుకువచ్చి దానిని స్టడీ చేయడానికి ఒక కమిటీని వేస్తూ తన ఉద్దేశాలను బయటపెట్టింది. మాజీ రాష్ట్రపతి రాం నాథ్
కోవింద్ ను దీనికి అధ్యక్షునిగా నియమించింది. ఇప్పటికే విస్త్రుతంగా చర్చ జరిగిన ఈ
అంశాన్ని ఒక కొలిక్కి తేడానికే ఈ కమిటీని వేశారు.
ఒక దేశం ఒకే ఎన్నిక… (1)
బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న నినాదమిది.. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి చేసిన
వాగ్దానం కూడా ఇదే.. రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి విడి విడిగా ఎన్నికలు నిర్వహించడం
ఎక్కువ ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. ప్రధాని మోడీ అనేక సందర్భాల్లో దేశ వ్యాప్తంగా
ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.మన దేశంలో 1967 నుంచి
ఇప్పటి వరకూ నాలుగు సార్లు మాత్రమే అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు
జరిగాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకు మధ్యలోనే ప్రభుత్వాలు పడిపోయి ఎన్నికలు
నిర్వహించాల్సి రావడంతో ఈ అలవాటు తప్పింది. 1970లో లోక్ సభ ఏడాది ముందే రద్దయి
మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.
జమిలి ఎన్నికలు సాధ్యమా? (1)
రాజకీయాల్లో నేరస్తులను ఏరేయడానికి ఎన్నికల సంస్కరణలేమార్గమని వాదిస్తున్న బీజేపి
ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. ఇతర పార్టీలతో
చర్చించి ఈ ప్రతిపాదనను ఆమోదించేందుకు కొంత కాలంగా పావులు కదుపుతోంది.జమిలి
ఎన్నికలు జరిపితే ఖర్చు తగ్గుతుంది. ఆకాశాన్నంటుతున్న అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు నేలకు
దిగొస్తుంది. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి ఒకేసారి ఎన్నిక జరపడం వల్ల పోలింగ్ సిబ్బంది
కలిసొస్తారు.
శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రభుత్వ యంత్రాంగానికి సులభమవుతుంది.
ప్రభుత్వ ఖజానా ఖర్చు, పోలింగ్ సిబ్బంది, శాంతి భద్రతల అదుపుకు భద్రతా బలగాల సిబ్బంది
అన్ని కలిసొస్తాయి. కాకపోతే ఒకేసారి నిర్వహించడానికి అవసరమైన సిబ్బందిని సిద్ధం
చేసుకోవడమే అసలు పరీక్ష. ఇది రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఎన్నికల ఖర్చును తగ్గించడానికి
ఉపయోగపడుతుంది. పైగా తరచుగా ప్రభుత్వాలను కూల్చడం,సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు
లాంటి రాజకీయ తలనొప్పులు తగ్గుతాయి.
జమిలి ఎన్నికలపై 2016 నుంచి మోడీ ప్రస్తావన చేస్తున్నా 2018 నాటికి ఇది
చర్చనీయాంశమైంది.దీనిపై అఖిల పక్ష సమావేశానికి ప్రధాని పిలిచినా ప్రతిపక్షాలు మాత్రం
గైర్హారయ్యాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కాబట్టి దీనిపై నిర్ణయం తీసుకుని అమలు చేసే దిశగా బీజేపీ అడుగులేస్తోందనిపిస్తోంది.
ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి. బీజేపి అధికారంలోకి
వచ్చాకే ఒక దేశం, ఒకఎన్నిక, ఒక దేశం (1) – ఒక సంస్క్రుతి, ఒకదేశం -ఒకే మతం, ఒక దేశం-ఒకే
భాష, ఒక దేశం- ఒకే పన్ను, ఒకదేశం- ఒకే జాతీయత లాంటి అంశాలు తెర మీదకొస్తున్నాయని
వామపక్షాలు మండిపడుతున్నాయి.
ఇదంతా చివరకు ఒక దేశం ఒకే పార్టీ, ఒక దేశం ఒకే
మతం దిశగా నడిపించే ఎత్తుగడ అని సీపీఐ నేత రాజా విమర్శించారు. “పార్లమెంటు అత్యున్నతమైనదని అంబేద్కర్ చెప్పారు..కానీ బీజేపీకి పార్లమెంటును గౌరవించడం రాదు.ప్రత్యేక సమావేశాలంటున్నారు.. వాటి లక్ష్యం ఏంటో తెలీదు. ఇండియా పేరిట కొత్త కూటమితో ప్రతిపక్షాలన్నీ ఏకమవడం బీజేపీకి కంటగింపుగా మారింది. అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కొత్త డ్రామాకు తెర” తీసిందని విపక్షాలు విమర్శించాయి.
రాజ్యాంగ సవరణ తప్పదా? (1)
దేశం ఒకే ఎన్నిక కలను సాకారం చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదు. దానికి పార్లమెంటు ఉభయ సభల సభ్యుల మూడింటా రెండొంతుల మెజారిటీ అవసరం.ఈఏడాది నవంబర్- డిసెంబర్ మధ్య కాలం నాటకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ,మిజోరం రాష్ష్టాలు ఎన్నికలకు వెళుతున్నాయి. వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.