(IND)
దేశమంతటా ఒకటే చర్చ. లోక్ సభ ఎన్నికలు ముందస్తు వస్తాయంటూ విపక్ష నేతలు పదే పదే చెబుతున్నారు. ఇండియా కూటమిలోని ముఖ్యనేతలు మమత బెనర్జీ, నితీష్ కుమార్ లు సయితం డిసెంబరులో లోక్ సభ ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. మమత ఒకడుగు ముందుకేసి బీజేపీ అందుకే ప్రయివేటు హెలికాప్టర్లన్నీ బుక్ చేసి పెట్టుకుందని కూడా అన్నారు.
విపక్ష ఇండియా కూటమి మరింత బలోపేతం కాకముందే.. రాహుల్ రెండో విడత పాదయాత్ర పూర్తి కాకముందే ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలోని అధికార పార్టీ నేతలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజానిజాలు మాత్రం తేలకున్నా దేశ వ్యాప్తంగా మాత్రం ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మాత్రం పెద్దయెత్తున సాగుతున్నాయి.
సర్వేలు అనుకూలంగానే ఉన్నా…
అన్ని సర్వేలు తమకు అనుకూలంగానే నరేంద్ర మోదీ ముందుగా ఎన్నికలకు ఎందుకు వెళతారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే క్రమేపీ రాష్ట్రాల్లో కొంత కమలం పార్టీ బలహీనం కావడం, రానున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో పరాజయం పాలయితే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతుందని భావించి ఉండవచ్చన్న అంచనాల మధ్య ఈ ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతుంది.
అందుకే ఐదు రాష్ట్రాలతో కలసి లోక్ సభ ఎన్నికలకు వెళ్లేందుకు మోదీ, షా నిర్ణయించారని కూడా చెబుతున్నారు.కర్ణాటకలో మోదీ ఎంత ప్రచారం చేసినా సానుకూల ఫలితాలు లభించలేదు. ఈ పరిస్థితుల్లోనే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం వంటి చర్యలకు దిగారని కూడా అనేవారు లేకపోలేదు.
ఏపీలో మాత్రం…
మరి లోక్ సభ ఎన్నికలు ముందు వస్తే ఏపీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జగన్ మాత్రం ఖచ్చితమైన సమయానికే వెళతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు ముందు జరిగినా తాము మాత్రం పూర్తి కాలం అధికారంలో ఉంటామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే మోదీ, షాలు ముందు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఆ తర్వాత ఏపీలో పొత్తుల గురించి ఆలోచించడానికి అవకాశం వీలుంటుంది.
లోక్ సభ ఎన్నికల్లో వచ్చే సీట్లను బట్టి ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారంటున్నారు. వైసీపీ లోక్ సభ స్థానాలు అధికంగా వస్తే మాత్రం జనసేనతో కలసి పోటీ చేస్తారు. అలాకాకుండా టీడీపీకి అత్యధిక స్థానాలు వస్తే మాత్రం ఖచ్చితంగా సైకిల్ పార్టీతో జత కడతారని కూడా ప్రచారం జరుగుతుంది.అయితే లోక్ సభ ఎన్నికలకు ముందస్తుగా వెళితేనే టీడీపీతో పొత్తు పై స్పష్టత రానుందని చెబుతున్నారు. (IND)
ఎటూ మనోళ్లే…
ఏపీలో ప్రత్యేక పరిస్థితులున్నాయి. ఎవరయినా చివకు తమకు మద్దతివ్వాల్సిందే. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ కూటమికి అన్ని పార్టీలూ దూరంగా ఉంటాయి. విభజన జరిగి పదేళ్లయినా ఆ గాయం నుంచి ప్రజలు తేరుకోలేదన్న భావన మిగిలిపోయింది. హైదరాబాద్ మనకి దూరమైందన్న మనోవేదన అక్కడి ప్రజల్లో ఇంకా నెలకొని ఉండటంతో ఏపీలోని ప్రాంతీయ పార్టీలేవీ కాంగ్రెస్ కు మద్దతివ్వవు. ఇప్పటి వరకూ ఇండియా కూటమికి దూరంగానే ఉన్నాయి.
ఆ ధైర్యంతోనే మోదీ, షాలు ఏపీ విషయంలో ధైర్యంగా ఉన్నారు. అందుకే లోక్ సభ ఎన్నికలు ముందు జరిగినా, అనుకున్న సమయానికి జరిగినా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేందుకు కమలం పార్టీ సిద్ధంగా ఉండదన్న వాదననుకూడా కొట్టిపారేయలేం. మొత్తం మీద ముందస్తు ఎన్నికలకు మోదీ వెళితే మాత్రం ఫలితాలను బట్టి అప్పటి కార్యాచరణ ఉంటుందన్నది పార్టీ వర్గాలు చెబుతున్న విషయం. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. (IND)