వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (elections) ఎలాగైనా భారతీయ జనతా పార్టీని ఓడించాలన్న కసి విపక్ష నేతల్లో కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో యూపీఏగా ఉన్న విపక్ష కూటమి ఈసారి I.N.D.I.A గా అవతరించింది. ఇప్పటికే రెండు దఫాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. మూడో సారి కూడా సమావేశమయ్యేందుకు సిద్ధమవుతుంది. ముంబయి వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.దీంతో మోదీని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాలను రాష్ట్రాల వారీగా కూడా సిద్ధం చేస్తారని చెబుతున్నారు.
రానున్న ఎన్నికలను…
2024 ఎన్నికలను ఇండియా (ఇండియన్ నేషనల్ డెవెలెప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయన్స్) సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే పదేళ్లు అధికారానికి దూరమై బీజేపీ బాధ నుంచి బయటపడాలంటే తాము ఈసారి గెలిచి తీరాలని ప్రతి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు గట్టిగా అభిప్రాయపడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే తాము రాష్ట్రాల్లో గెలిచినా వృధాయేనని, తాము ప్రజాభిప్రాయంతో గెలిచిన ఐదేళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాయి. గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికలకు విపక్ష పార్టీల పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఇన్ని పార్టీల మధ్య ఇండియా కూటమి ఎలా నెట్టుకొస్తుందన్న అనుమానాలు లేకపోలేదు.
అన్నీ ప్రాంతీయ పార్టీలే… (elections)
పైగా ఇండియా కూటమిలో ఉన్నవి దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు. ఎవరికి వారే వాళ్ల రాష్ట్రాల్లో కింగ్ లు. పార్లమెంటులోనూ తమ బలం చూపించాలనుకుంటారు. పార్లమెంటులో బలాన్ని బట్టే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమకు గౌరవమర్యాదలిస్తుందని నమ్ముతారు. అందులో వాస్తవం లేకపోలేదు. అయినా మమత బెనర్జీ వంటి నేతలు తమ పట్టును ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే రకం కాదు. తన సొంత రాష్ట్రమైన బెంగాల్ లో కాంగ్రెస్ కు సూది మొనంత అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని ఆమెకు తెలియని విషయం కాదు. అందుకే పొత్తులతో కలసి పోటీ చేసేందుకు మమత బెనర్జీ సుముఖత చూపే ఛాన్స్ లు సూది మొనంత కూడా లేదు.
కొంత దిగివచ్చినా…
అయితే మమత కొంత వరకూ దిగి వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి పార్టీలు పనిచేసేందుకు అంగీకరించారు. తమ కూటమి గెలిస్తే ప్రధాని పదవిని కూడా కాంగ్రెస్ కు ఇవ్వడానికి ఆమె సిద్ధపడ్డారు. అయితే సీట్ల పంపకాల్లో మాత్రం మెలిక పెట్టే అవకాశాలున్నాయి. మెజారిటీ స్థానాల్లో తాము పోటీ చేస్తామని, కాంగ్రెస్ కు బలమున్న చోట, ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లోనే పోటీ చేస్తే మంచిదన్న సూచనలు చేయవచ్చని చెబుతున్నారు. మమత ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆమె ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. అలాగని ఆమె అన్నింటికీ తలొగ్గే పరిస్థితి లేదు. కలసి పని చేయాలంటే.. పోటీ విషయంలో వెనక్కు తగ్గాలని కాంగ్రెస్ కు ఆమె గట్టిగానే కోరే అవకాశాలు పుష్కలం. ఈ నేపథ్యంలో కీలక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మమత బెనర్జీ ఇండియా కూటమిలో తన పట్టును నిలుపుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు.
వెనక్కు ఒక అడుగు… (elections)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ ఆ బాధ్యతలను తనకు అప్పగించాలని కోరనున్నారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే ప్రధానిగా నియమించుకునే అవకాశం ఆమె ఇస్తారని, అయితే కూటమి పై తన గ్రిప్ ఏ మాత్రం సడలి పోకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలను దీదీ తీసుకుంటారన్నది వాస్తవం. కానీ ఏ రూపంలో ఆమె డిమాండ్లు ఉంటాయి? ఇండియాకూటమిలో బలమైన పార్టీగా తమకు దక్కాల్సిన ప్రాధాన్యతలపైన గురించి కూడా ఆమె ముందుగానే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి క్లారిటీ తీసుకునే అవకాశాలున్నాయి. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం. మమత చాలా వరకూ తగ్గారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తన పవర్ చేజారిపోతుందన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు గెలిచిన మమత నాలుగో సారి గెలవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని భావిస్తున్నారు. ఈ ఎన్నికల వరకు అయితే మమత కాంగ్రెస్ వెనక నడవటానికి సిద్ధపడనున్నారు. కానీ తర్వాత ఏంటి? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. (elections)