భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యే ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. కాంగ్రెస్ ముందుండి వరస సమావేశాలతో అన్నింటినీ ఒకటిని చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా పూనుకుని వచ్చే ఎన్నికలలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ ఒకటిగా కదలాలన్న నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఇటీవల బీహార్ లో జరిగిన సమావేశం కూడా సక్సెస్ అవ్వడంతో తాజాగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
24 పార్టీలు హాజరయ్యే…
మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా దాదాపు 24 పార్టీలు ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేసి విపక్ష నేతలకు ఆహ్వానం పలుకుతుండటంతో వారంతా హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీహార్ సమావేశానికి దూరంగా ఉన్న ఆర్ఎల్డీ, ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ పార్టీలు బెంగళూరు సమావేశానికి రానున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 24 పార్టలకు లోక్ సభలో 150 సభ్యుల బలం ఉంది.
పార్లమెంటు సమావేశాల్లో….
రానున్న పార్లమెంటు సమావేశాల్లో మోదీ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ చట్టాన్ని తేనుండటంతో విపక్షాలన్నీ వ్యతిరేకించాలని ఇప్పటికే నిర్ణయించాయి. పార్లమెంటు సమావేశాల్లో తెచ్చే ఈ బిల్లును ఎలా అడ్డుకోవాలన్న దానిపై బెంగళూరులో జరిగే సమావేశంలో చర్చించనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే విడివిడిగా పోటీ చేయడం కన్నా, కలసి పోటీ చేయడం బెటర్ అని కొన్ని పక్షాలు సూచిస్తున్నాయి. దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశముంది. మొత్తం మీద మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు చేస్తున్న సన్నాహాలు ఏ మేరకు ఫలితాలిస్తాయన్నది చూడాల్సి ఉంది.