Andhra Pradesh: విజయవాడ: కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తాజాగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2019 నుంచి 2021 వరకు మూడు సంవత్సరాలలో, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 30,196 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని పేర్కొనడంపై పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సర్కారుకి పలు ప్రశ్నలు సంధించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 7918 మంది బాలికలు , 18 ఏళ్లు పైబడిన 22,278 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సహాయ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానాన్ని ట్విటర్ ద్వారా ప్రస్తావించిన పవన్ కళ్యణ్.. ఏపీలో అదృశ్యమైన బాలికలు, మహిళల గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందని స్పష్టం అవుతోందన్నారు.
మన రాష్ట్రం నుంచి బాలికలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు ? వారికి ఏమి జరుగుతోంది ? వీరి అదృశ్యం వెనుక ఏం జరుగుతోంది, ఎవరు బాధ్యత తీసుకుంటారు ? అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి, ఏపీ మహిళా కమిషన్కి ప్రశ్నలు సంధించారు. రేపు ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా ? లేదా చూడాలి అని సందేహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఇకనైనా ఏపీ మహిళా కమిషన్ రాష్ట్ర హోం శాఖను, ఏపీ డీజీపీని వివరణ కోరుతుందా లేదా అని పవన్ కళ్యాణ్ తన సందేహాన్ని వెలిబుచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా ? అని మహిళా కమిషన్ని సైతం నిలదీశారు
రాష్ట్రంలో మహిళలు, బాలికల మిస్సింగ్ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ స్పందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది అని ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. చివరలో #WakeupAPMahilaCommission , #SaveAPfromYCP అంటూ ఏపీ మహిళా కమిషన్ ఇకనైనా నిద్ర నుంచి మేల్కోవాలని.. అలాగే వైసీపీ నుంచి ఏపీని రక్షించాలి అని హ్యాష్ ట్యాగ్స్ ద్వారా తన నిరసన వ్యక్తంచేశారు.