టమాటా బంగారంలా మారింది. చివరకు టమాటాకు సెక్యురిటినీ పెట్టాల్సి వస్తుంది. టమాటా రైతులు హత్యలకు కూడా గురవుతున్నారు. ఒక్క నెలలో టమాటా రైతు కోటీశ్వరుడిగా మారిన ఘటనలు అనేకం వింటున్నాం. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలలో టమాటా రైతులకు పంట వరంగా మారింది. మార్కెట్ కు వెళ్లకుండానే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. బాక్సు మూడు వేల రూపాయల వరకూ పెట్టి కొనుగోలు చేస్తుండటంతో రైతును టమాటా రాజుగా మార్చేసింది.
దిగుబడి తగ్గడంతో…
ప్రస్తుతం టమాటా కిలో 140 రూపాయల వరకూ పలుకుతుంది. బయట మార్కెట్ లో మరింత ధర పలుకుతుంది. టమాటా ధర పెరగడంతో డిమాండ్ కూడా తగ్గింది. దిగుబడి తగ్గడం, వర్షాలు కారణంగా టమాటా దిగుబడి పూర్తిగా తగ్గింది. అందుకే టమాటాకు అంతటి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో టమాటాను రక్షించుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పొలాల్లో కాపలా ఉంచుతున్నారు. మార్గమధ్యమంలో టమాటా వాహనాలను హైజాక్ చేస్తున్నారు.
భద్రత కోసం…
ఈ నేపథ్యంలోనే దీంతో రైతులకు, టమాటాకు భద్రత కూడా కరువైంది. కొందరు ప్రయివేటుగా బౌన్సర్లను నియమించుకున్నారు. మరికొందరు టమాటా బాక్సులకు పోలీసుల సెక్యురిటీని కోరుతున్నారు. తెలంగాణలోని కొమురం భీం జిల్లాలోని వాంకిడి వద్ద పదిహేను లక్షల రూపాయల విలువైన టమాటా లారీ బోల్తా పడింది. దీంతో సరుకును ప్రజలు ఎత్తుకు వెళతారని భావించి పోలీసులను యజమాని కాపలాగా ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.