మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్త. వందల కోట్లకు అధిపతి. ఆయన వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరతారని తొలుత భావించినా చివరకు పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పదవిని కూడా ఇచ్చింది.
ఆత్మీయ సమావేశాలు నిర్వహించి…
కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జనం బాగానే హాజరయ్యారు. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించడంతో అప్పట్లో సొంత పార్టీ పెడతారని అందరూ భావించారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ లో టిక్కెట్లు దక్కడం ఆయన చేతిలో ఏమీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో పాగా వేయాలని సర్వేలు చేయించి నివేదికల ఆధారంగానే టిక్కెట్లను కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులందరికీ టిక్కెట్లు దక్కడం మాత్రం కష్టమే. అందరికీ ఇవ్వాలన్న ఆయన డిమాండ్ నెరవేరకపోవచ్చు. ఎందుకంటే పార్టీకి గత నాలుగేళ్ల నుంచి కష్టపడిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి ఎలా ఇస్తారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.
బీఆర్ఎస్ లో చేరి…
2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ లో తనకు రాజ్యసభ పదవి లేదా ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని భావించారు. కానీ ఖమ్మం జిల్లా పరిస్థితుల దృష్ట్యా ఆయనను బీఆర్ఎస్ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో బయటకు వచ్చారు. అయితే ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ కాంగ్రెస్ బలంగానే ఉంటుంది. గత ఎన్నికల్లోనూ ఒక్క స్థానంలోనే బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన అన్ని స్థానాలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కైవసం చేసుకున్నాయి.
పార్టీలో చేరితే…
ఈ పరిస్థితుల్లో పొంగులేటి చేరికతో కాంగ్రెస్కు కొత్తగా వచ్చే లాభమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది. నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడమేంటని కూడా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉదయపూర్ తీర్మానాన్ని ఉదహరిస్తున్నారు. ఉదయపూర్ లో జరిగిన తీర్మానంలో కొత్తగా వచ్చిన నేతలకు వెంటనే పార్టీ పదవులు ఇవ్వకూడదని, కనీసం ఐదేళ్లు పార్టీలో ఉంటేనే వారికి పదవులు ఇవ్వాలని తీర్మానించారు. కానీ ఆ తీర్మానాన్ని తుంగలో తొక్కి కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ పదేళ్లు అధికారంలో లేకపోవడంతో జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అందుకే ఆర్థికంగా బలమైన నేతలకు పదవులు ఇస్తున్నారన్న వాదన కూడా లేకపోలేదు. దీంతో పొంగులేటి వల్ల కాంగ్రెస్ కు పెద్దగా లాభం లేకపోయినా.. ఆయనకే పార్టీ అండగా ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.