రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను తెలంగాణలో అడ్రస్ లేకుండా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వరంగల్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగం మొదలు పెట్టారు. చారిత్రాత్మకమైన వరంగల్ కు రావడం ఎంతో సంతోషంగా ఉందని మోదీ అన్నారు. భద్రకాళి మహత్యం, సమ్మక్క సారక్క పౌరుషం, రాణీరుద్రమ పరాక్రమం అంటూ మోదీ తెలుగులో మాట్లాడారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ట్రైలర్ మాత్రమే చూపించిందన్న మోదీ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో పనిచేసిందని చెప్పుకొచ్చారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయం అనిపిస్తుందని మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఎంతో ఉందని అన్నారు.
కుటుంబమే స్కామ్ లు…
కాజీపేట్ వ్యాగన్ యూనిట్ల తయారీ కేంద్రం రైల్వేకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని మోదీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ లక్ష్యమన్న ప్రధాని మోదీ తెలంగాణకు పెద్దయెత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. బీజేపీకి రెండు సీట్లు ఉన్నప్పుడు ఒక్కటి వరంగల్ నుంచే వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు మోదీ. ఉదయం లేస్తే బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మోదీ మండిపడ్డారు. కుటుంబాన్నిపెంచి పోషించుకోవడమే బీఆర్ఎస్ సర్కార్ పని అని మోదీ ఆరోపించారు.
ఆర్థిక వ్యవస్థను…
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. ఇన్నిరోజులు తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణలో అవినీతి లేని ప్రాజెక్టు లేదన్న మోదీ, కేసీఆర్ కుటుంబం స్కాముల్లో కూరుకుపోయిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుటుంబ అభివృద్ధి కోసమే కేసీఆర్ పరితపిస్తారు తప్పించి రాష్ట్ర్ర అభివృద్ధిని గురించి పట్టించుకోరని మోదీ ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కామ్ లో ఎవరు ఉన్నారో చెప్పాలంటూ నిలదీశారు.ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. నిరుద్యోగులను అన్యాయం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత కూడా ఉందన్న మోదీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయిందని విమర్శించారు. లక్షలాది మంది యువత భవిష్యత్ ను నాశనం చేశారన్నారు.
అన్ని రంగాలపై…
కేసీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా గురిపట్టాయని మోదీ తెలిపారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల అవినీతిని బయటపెడతామని తెలిపారు. అవినీతిని ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ కొత్త నాటకాలను మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ తన మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. విద్య,వైద్య రంగాల పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చామన్న మోదీ రైతుల మేలు కోసం పలు పథకాలను కేంద్రం అమలు చేస్తుందన్నారు. దళితులతో పాటు అన్ని వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు.
Follow Us On : YouTube , Google News