ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి కూడా ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్ కనిపిస్తారా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు వరంగల్ కు వస్తున్న ప్రధాని మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. సుమారు 6,100 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్ కు కూడా నరేంద్ర మోదీ కొబ్బరి కాయ కొట్టనున్నారు. వీటితో పాటు జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. వరంగల్ లో 144వ సెక్షన్ విధించారు. మోదీ అక్కడ ఉన్నంత సేపు నో ఫ్లై జోన్ గా అధికారులు ప్రకటించారు.
అధికారిక ప్రకటన…
మోదీ పర్యటనకు ఈసారి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటికే అధికారిక షెడ్యూల్ విడుదలయింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం అందింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం పంపలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. సాధారణంగా ప్రధాని రాష్ట్రానికి వస్తే విమానశ్రయంలో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి వీడ్కోలు వరకూ ముఖ్యమంత్రి ఆయన వెంటే ఉంటారు. ఇటీవల రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో కేసీఆర్ పాల్గొన్నారు. అయితే మోదీ పర్యటనకు ఆయన వస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కొద్ది రోజులుగా…
గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్, బీజేపీకి మధ్య వార్ జరుగుతుంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. జాతీయ స్థాయిలో ఆయన వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశమై రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి స్ట్రాటజీలను రూపొందిస్తున్నారు. సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో తరచూ భేటీ అవుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లోనూ బీఆర్ఎస్ ఎంపీలు సభకు ఆటంకం కలిగిస్తున్నారు. విపక్షాలతో కలసి పార్లమెంటు ఉభయ సభల్లో లోపల, బయట ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రేపటి మోదీ సభకు హాజరవ్వడం కష్టమేనన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
గతంలోనూ….
గతంలోనూ మోదీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయితే అప్పట్లో వివిధ కారణాలు చెప్పారు. ఒకసారి ఆరోగ్యం బాగా లేదని, మరొకసారి మోదీ టూర్ సమయానికి మరొక ప్రాంతానికి వెళ్లి కేసీఆర్ మోదీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మోదీని రిసీవ్ చేసుకోవడానికి, వీడ్కోలు పలకడానికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను పంపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసారి కేసీఆర్ మోదీ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటు మోదీ, అటు కేసీఆర్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తరుణంలో దూరంగా ఉండటమే మేలన్న అభిప్రాయం పార్టీలోనూ వ్యక్తమవుతుంది. అయితే వరంగల్ లో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి హాజరయితే మంచిదన్న సూచనలు కూడా అందుతుండటంతో కేసీఆర్ హాజరీపై ఉత్కంఠ నెలకొంది.
Follow Us On : YouTube , Google News