(Putharekulu)
“పూత రేకులా తీయదనం నీ లేత సొగసులో ఉంది”అంటూ..సినీ కవుల భావనకు అందమైన రూపమిచ్చిన పూతరేకుకు మరో అరుదైన గౌరవం కూడా దక్కబోతోంది. ఆత్రేయపురం వాసుల చిరకాల కల నెరవేరింది.
ఆత్రేయపురం పూత రేకులకు ఎట్టకేలకు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ వచ్చింది. అంటే భౌగోళిక గుర్తింపు అనమాట.నిజానికి ఎప్పటినుంచో ఈ వంటకానికి జియో ట్యాగ్ రావాల్సిఉండగా దీనికోసం ప్రత్యేకించి కృషి చేసే వారు లేకపోవడం, పూతరేకులు చుట్టే నైపుణ్యం తెలిసిన మహిళలు నిరక్షరాస్యులు కావడం, పేదరికం, అన్నీ శాపాలుగా మారి ఈ గుర్తింపు ఇంత ఆలస్యంగా దక్కింది.
ఏ దైతేనేం డాక్టర్ బీ. ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లాలో ని ఆత్రేయ పురం వాసులు ఇప్పుడు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. విశాఖ పట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ యూనివర్సిటీలో ఈనెల 15న ఆత్రేయపురం పూతరేకులకు గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నారు.
అవినాభావ సంబంధం
ఆత్రేయ పురం అంటనే పూత రేకులు.. పూతరేకులంటేనే ఆత్రేయపురం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఊరు పూతరేకులకు గుర్తింపుతో జాతీయ స్థాయికి చేరిపోయింది. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఈ అపురూప వంటకం దాదాపు 400 ఏళ్ల నాటిది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వంటకం ఆర్డర్ లేకుండా ఏ పెళ్లీ జరగదు. పూతరేకులు స్పెషల్ లేకుండా అక్కడ పెళ్లిళ్లను ఊహించుకోలేము. పూతరేకుల తయారీలో ఈ ఊరికి మాత్రమే స్పెషల్ గా గుర్తింపు దక్కింది. అయితే దీనికి శ్రమించినది మాత్రం విశాఖ పట్నంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ వారు.
గుర్తింపు దక్కిందిలా… (Putharekulu)
విశాఖపట్నంలోని నల్సార్ యూనివర్సిటీ (దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ యూనివర్సిటీ)లో ఉన్న మేథో సంపత్తి హక్కుల విభాగం తొలిసారి ఈ అంశంపై స్పందించింది. ఆత్రేయ పురం వెళ్లి అక్కడి స్థానికులను కలసి వాటి తయారీ వివరాలన్నింటినీ సేకరించింది. ఆ తర్వాత ఈ డాక్యుమెంట్లను 2021 డిసెంబర్ 13న చెన్నై లోని జియో ఐడెంటిటీ ఆఫీస్ కు దరఖాస్తు చేశారు. కొన్ని నెలల తర్వాత తయారీ దార్లు ఆధారాలతో హాజరవ్వాలని ఆదేశాలు అందాయి. ఆత్రేయపురంనుంచి ఏడుగురు సభ్యుల బృందం అక్కడకు చేరుకుని దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చారు.ఏపీ ప్రభుత్వం కూడా ఆన్ లైన్ ద్వారా ఈ పరీక్షకు హాజరై అధికారుల ప్రశ్నలకు వివరాలు అందించింది. జియో ట్యాగింగ్ ఇచ్చేందుకు అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నోటీస్ కూడా పెట్టారు. అయితే ఎటువంటి అభ్యతరాలు రాకపోవడంతో ఆత్రేయపురానికి జియో ట్యాగ్ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎలా చేస్తారు? (Putharekulu)
బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానపెడతారు. ఆపై దానిని తడి పిండిగా రుబ్బుతారు. దానిలో తగినంత నీరుపోసి పల్చగా చేస్తారు. ఇక పూత రేకును తీయడానికి ప్రత్యేకమైన కుండలు దొరుకుతాయి. వాటికి ఒకవైపు నిప్పు వెలిగించుకునే వీలుంటుంది.కుండ లోపల కర్రలతో నిప్పు మండుతుడగా కుండ బాగా వేడెక్కాక ఈ పూతరేకును వేస్తారు. పూత రేకు వేసేందుకు పల్చటి తెల్లని బట్టను వాడతారు. బియ్యం పిండి నీటిలో ముంచిన బట్టను బాగా కాలిన కుండపై వేగంగా ఒకసారి వేసి తీసేస్తారు. ఆవేడికి కుండకు అంటుకున్న బియ్యపు పిండి నీరు పల్చని రేకుగా మారుతుంది. బాగా కాలాక ఆ రేకు దానంతట అదే ఊడి వచ్చేస్తుంది.ఇలా తీసిన పూత రేకులకు నెయ్యిరాసి పిస్తా,జీడి పలుకులు, బాదం పలుకులు ,యాలక్కాయల పొడి వేసి,బెల్లం లేదా పంచదార పొడి జల్లి వీటిని అందంగా మడత పెడతారు.మన టేస్ట్ ని బట్టి బెల్లం, లేదా పంచదార ఏదో ఒకటి వాడుకోవచ్చు..
ఈ పూతరేకులు తింటుంటే నోట్లోనే కరిగిపోయి చాలా టేస్ట్ గా ఉంటాయి. శతాబ్దాలుగా ఈ పూతరేకుల తయారీ ఆత్రేయపురంలో వాడుకలో ఉంది. ఆర్ధికంగా చితికి పోయిన వారు, సరైన ఆదాయ మార్గం లేనివారు ఆత్రేయ పురంలో పూతరేకులు చుడుతుంటారు. వీటిని చుట్టి సమీపంలో స్వీట్ షాపులకు అమ్ముతుంటారు.పెళ్లిళతో సహా అన్ని శుభకార్యాలకు వీటిని ఆర్డర్ చేస్తుండటంతో ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ బాగా ఫేమస్ అయిపోయింది. భారీ ఆర్డర్లు తీసుకుని అత్యంత శ్రద్ధతో నాణ్యమైన రేకులను స్థానికులు ఇస్తుంటారు.ఎక్కువగా మహిళలే ఈ వృత్తిలో కొనసాగుతారు. ఇది మహిళలకు స్వయం ఉపాధిగా కూడా మారింది. పూతరేకులను విదేశాలకు కూడా బాగా తీసుకెళుతుంటారు. భారీ ఆర్డర్లువస్తే వీరికి రోజంతా పనే…అమెరికా, గల్ఫ్ లాంటి దేశాలనుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుంటాయి.