(Raki)
రక్షా బంధన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. వంట గ్యాస్ సిలెండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిలిండర్ ధరపై రెండు వందల రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని సోదరీమణులకు ఈ తగ్గింపు గొప్ప బహుమతిగా ఆయన అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం తొలిసారి వంట గ్యాస్ ధరలను తగ్గించడం విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
రెండు వందలు…
ప్రస్తుతం వంట గ్యాస్ సిలెండర్ ధర పదకొండు వందల రూపాయలుగా ఉంది. కాంగ్రెస్ హయాంలో నాలుగు వందలున్న సిలిండర్ ధర ఈ తొమ్మిదేళ్ల నుంచి చమురు సంస్థలు పెంచుకుంటూ వెళ్లాయి. సబ్బిడీ మొత్తం కూడా తగ్గించడంతో వినియోగదారులపై భారం పడింది. ప్రతి రెండు నెలలకు ఒక సిలెండర్ వాడాల్సి రావడంతో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో వ్యతిరేకత నెలకొందన్న అభిప్రాయం నెలకొంది. అయితే దీని నుంచి బయటపడేందుకు సిలెండర్ ధరను రెండు వందల రూపాయలు తగ్గిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంతో రక్షాబంధన్ కు మహిళా లోకానికి విలువైన బహుమతిగా కేంద్ర మంత్రి తెలిపారు.
ఉజ్వల్ పథకం కింద… (Raki)
రెండు వందల రూపాయలు సిలెండర్ ధరను తగ్గించడంతో తొమ్మిది వందల రూపాయలకే సిలిండర్ దక్కుతుంది. ఇక ఉజ్వల్ పథకం గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి మాత్రం నాలుగు వందల రూపాయల ప్రయోజనం చేకూరనుంది. సబ్సిడీ రూపంలో ఉజ్వల్ పథకం కింద లబ్దిదారులకు రెండు వందల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు రెండు వందలు తగ్గించడంతో ఏడు వందల రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఉజ్వల్ పథకం లబ్దిదారులకు అందనుంది. ఉజ్వల్ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వారు దేశ వ్యాప్తంగా 10.35 కోట్ల మంది ఉన్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఇప్పటి వరకూ…
చమురు సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్, పెట్రోలు ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి ధరలను తగ్గించడమా? పెంచడమా? అన్నది చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటి వరకూ కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రమే చమురు సంస్థలు తగ్గించాయి. అంతే తప్ప గృహ వినియోగానికి వాడే సిలిండర్ ధరను మాత్రం కొన్ని నెలలుగా తగ్గించకపోగా పెంచుతూ వస్తున్నాయి. ఇది ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుందని గ్రహించిన ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గి రెండు వందల రూపాయలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సీజనంటూ…
త్వరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. వెనువెంటనే లోక్ సభ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేందుకు సిలిండర్ ధరను ప్రధాని మోదీ తగ్గించారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తమ హయాంలో నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ధరను 1100 రూపాయలకు పెంచడంపై కూడా వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. విపక్షాలకు వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వకుండా తాము హ్యాట్రిక్ విజయం సాధించాలంటే అన్ని వర్గాలను ఆకట్టుకునే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పయనిస్తుంది. (Raki)