(Train)
ఒరిస్సాలో కోణార్క్ రైలు ఘోర ప్రమాదం మరవక ముందే వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.మానవ తప్పిదమా? లేక సాంకేతిక తప్పిదమా అన్నది పక్కన పెడితే తరచుగా రైలు ప్రమాదాలు అదీ సిగ్నలింగ్ లోపంతోనే జరగడం ఆందోళన పెంచుతోంది. మన సిగ్నలింగ్ వ్యవస్థను సాంకేతికపరంగా బలంగా సరిదిద్దాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు తెలియ చెబుతున్నాయి. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం చరిత్రలోనే అత్యంత దారుణమైన యాక్సిడెంట్. ఆ తర్వాత విశాఖ సమీపంలోనే మరో యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడిది మూడో రైలు ప్రమాదం. వరుస ప్రమాదాలతో అసలు రైలు ప్రయాణమంటేనే హడలిపోయే రోజులు వచ్చేస్తున్నాయ్. ఓ వైపు వందే భారత్ రైళ్లను అభివృద్ధి మోడల్ గా మోడీ ప్రభుత్వం చూపిస్తోంది. మరోవైపు ఇలా రైళ్లు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయ్..వరుస ప్రమాదాలకు దక్షిణ మధ్య రైల్వే బాధ్యత తీసుకోవాలి.
సిగ్నలింగ్ లోపమే ప్రమాదానికి కారణమా? (Train)
విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆగి ఉండగా వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీ కొట్టింది. ఇప్పుడీ ఘటనపై పలు ప్రశ్నలు విన్పిస్తున్నాయి. విశాఖ-పలాస రైలు మధ్య లైనులో ఎందుకు నిలిచింది, ఎగువన ఉన్న అలమండ స్టేషన్ నుంచి సిగ్నల్ అందకపోవడం కారణమా లేక ప్రమాద సమయంలో అక్కడ వైర్లు తెగిపడి ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఒక మార్గంపై ఒక రైలు ఆగి ఉన్నప్పుడు మరో రైలుకు ఎలా అనుమతిచ్చారనేది ప్రదాన ప్రశ్న. ఆటో సిగ్నలింగ్ లోపమే ఇందుకు కారణమని మరి కొంతమంది భావిస్తున్నారు. అందుకే అదే మార్గంలో విశాఖ-రాయగఢ్ రైలు వచ్చేసిందంటున్నారు. ఒకవేళ సిగ్నల్ లేక విశాఖ-పలాస రైలును ఆ మధ్య లైనులో నిలిపి ఉంచినట్టయితే విశాఖ-రాయగఢ్ రైలుకు సమాచారం చేరాల్సి ఉంటుంది. లేక హైటెన్షన్ వైర్లు తెగిపడి ఉండటం వల్ల రైలు నిలిపివేసినట్టయితే అది కూడా వెనుకన వచ్చే రైళ్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండూ ఎందుకు జరగలేదనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. సిగ్నల్ లోపమా, మానవ తప్పిదమా తేలాల్సి ఉంది.
ఏడు బోగీలు నుజ్జు నుజ్జు… (Train)
ఈ ప్రమాదంలో మొత్తం 5 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందగానే ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటు ప్యాసింజర్ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది. విజయనగరం రైలు ప్రమాదంపై అనుమానాలు పెరుగుతున్నాయి. పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లలో సుమారు 1,400 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంచనా ప్రకారం మృతుల సంఖ్య 40-50 వరకు ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకూ 14 మృతదేహాలను వెలికితీశారు. వీరిలో కొందరినే గుర్తించారు. ప్రయాణికులతో ఉన్న బోగీలు అదుపుతప్పడం, రెండుగా చీలిపోయి నుజ్జునుజ్జవ్వడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని బోగీలు పక్క ట్రాక్పై ఉన్న గూడ్సు రైలును ఢీకొన్నాయి. మొత్తం రెండు రైళ్లలో కలిపి ఏడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.
సత్వర సహాయ చర్యలకు సీఎం జగన్ ఆదేశాలు…
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై సీఎం జగన్ మెహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ కాసేపట్లో ఘటనా స్ధలనికి రానుండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని ఎక్కువ అంబులెన్స్లను పంపించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి మంచి వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సత్వర సహాయక చర్యలు చేపట్టేందుకు, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రైలు ప్రమాదంలో మరణించిన వారిలో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందిస్తున్నట్లు సిఎం అశ్విని వైష్ణవ్కు వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.