Red Book
రెండు తెలుగు రాష్ట్రాల్లో “రెడ్ బుక్” ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విపక్ష పార్టీలు “రెడ్ బుక్” ను బయటకు తీస్తూ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తాము అధికారంలోకి రాగానే రెడ్ బుక్ లో నమోదయిన అధికారుల పనిపడతామని హెచ్చరిస్తున్నాయి. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, విపక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెడుతున్న వారిని వదిలపెట్టబోమని అగ్రనేతలు వార్నింగ్ ఇస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. నిష్పక్షపాతంగా పనిచేయకపోతే తాము ఎవరినీ వదిలపెట్టే ప్రసక్తి లేదంటూ అగ్రనేతలు మీడియా సమావేశాల్లో “రెడ్ బుక్”ను ప్రదర్శించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
వేధిస్తున్న అధికారులను… Red Book
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళ పాదయాత్ర ఆరు నెలలుగా సాగుతుంది. ఆయన చేతిలో రెడ్ బుక్ కనిపిస్తుంది. రెడ్ బుక్ లో ఏముంటాయన్న ఉత్సుకతకు లోకేష్ తెరదింపారు. ఇటీవల దీనిపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారుల పేర్లను ఈ రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. నిబంధనలను తోసిరాజని అక్రమ కేసులు తమ పార్టీ కార్యకర్తలపై పెట్టడమే కాకుండా వారిని జైలు పాలు చేస్తూ వేధిస్తున్నారని, కొందరు అధికారులు తమ పార్టీ కార్యకర్తలపై అకారణంగా చేయి చేసుకుంటున్నారని, ప్రజాస్వామ్యపద్ధతిలో జరుగుతున్న ఆందోళనలను కూడా అణిచి వేస్తున్న పోలీసు అధికారులతో పాటు, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులను సయితం వదిలపెట్టబోమని హెచ్చరించారు.
అధికారంలోకి రాగానే…
ఇప్పటికే తన వద్ద ఉన్న రెడ్ బుక్ లో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి పేరు ఉందని నారా లోకేష్ బహిరంగంగానే చెప్పారు. తమ కార్యకర్తలను, నేతలను వేధిస్తున్న అధికారుల పేర్లను ఇందులో నమోదు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే తాము వారి పనిపడతామని లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. పోలీసులు తమ విధులను తాము నిర్వర్తిస్తే మంచిదని, చట్టాన్ని చేతులోకి తీసుకుని ఒకపార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదని చెబుతున్నారు. కొందరు అధికారులు అధికారపార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారికి న్యాయపరంగా,చట్టపరంగా శిక్షలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికారుల పేర్లను తన రెడ్ బుక్ లో నమోదు చేశానన్న లోకేష్ త్వరలోనే వారి పేర్లను బయటపెడతానని కూడా చెప్పారు.
రేవంత్ సయితం… Red Book
తెలంగాణలోనూ ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ అగ్రనేత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెడ్ బుక్ ను బయటపెట్టారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న అధికారుల పేర్లు రెడ్ బుక్ లోకి ఎక్కుతున్నాయని, అధికారంలోకి రాగానే వారి పనిపడతామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్ పోలీసుల విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అక్కడ తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధించడం మానుకోవాలని,లేకుంటే తాము అధికారంలోకి రాగానే వారు న్యాయపరమైన,చట్టపరమైన చిక్కులు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ అధికారి అయినా రూల్ బుక్ ప్రకారమే నడుచుకోవాలని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించకూడదని కూడా రేవంత్ ఫైర్ అయ్యారు. ఇలా రెండు తెలుగురాష్ట్రాల్లోని విపక్ష పార్టీల అగ్రనేతల చేతుల్లో రెడ్ బుక్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. Red Book