Sagar Dam
తెలంగాణ ఎన్నికల సంగతేమో గానీ ఐదేళ్లలో ఎన్నడూ లేని సెంటిమెంట్ రాజకీయాలు రగులుకున్నాయి. ఎన్నికల ముందు కేసీఆర్ ఇలాంటి జిమ్మిక్కులు ప్రదర్శించడం మామూలే.. సీమాంధ్రులను దొంగలు, దోపిడీ దారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, తెలంగాణ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు.. నాగార్జున సాగర్ డ్యాం దగ్గర రెండు రాష్ట్ల్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం చీప్ ఎన్నికల ఎత్తుగడ అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
శుక్రవారం పోలింగ్ ఉండగా గురువారం రాత్రి సాగర్ డ్యాం దగ్గర ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఏపీ వారు రాకుండా సరిహద్దుల్లో ముళ్ల కంచెలు బారికేడ్లు తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేస్తే అటు ఏపీ పోలీసులు తెలంగాణ వారు రాకుండా ఇదే తరహాలో అడ్డు పెట్టారు. ఇదే అదనుగా కృష్ణా నదిలో నీటిని ఏపీ అధికారులు విడుదల చేసుకున్నారు. ఏపీ అడ్డగోలుగా నీటిని వాడేస్తోందని తెలంగాణ కస్సుబుస్సు మంటోంది.
మా నీటినే మేం తీసుకున్నాం : అంబటి
తెలంగాణ అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలై ఉండగా, 700 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాగర్ డ్యామ్ దగ్గరకు చొచ్చుకువచ్చి రైట్ కెనాల్ లోకి గంటకు 500 క్యూసెక్కుల కృష్ణా నీటిని తరలించుకుపోయారు. తాగు నీటి కోసమే ఈ పనిచేసామని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో (ట్విటర్) ట్వీట్ చేశారు.
ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే తాము తమ వాటా నీటిని రాబట్టుకున్నామని మంత్రి ట్వీట్ లో క్లారిటీ ఇచ్చారు. ఒప్పందంలో ఉల్లంఘన ఏదీ జరగలేదని, కృష్ణా నదిలో 66 శాతం నీరు ఏపీకి, 34శాతం నీరు తెలంగాణకు చెందుతుందని, అంతకు మించి ఒక్క చుక్క కూడా తాము అదనంగా తీసుకోలేదని అంబటి తెలిపారు. మా భూభాగంలో ఉన్న కెనాల్ ఛానెల్ నే ఓపెన్ చేశామంటూ అంబటి తెలిపారు.
మేం చెప్పినట్లు వినాల్సిందే: కేంద్రం
మరోవైపు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందంటూ తెలంగాణ అధికారులు నానా హంగామా చేశారు .ఇరు వర్గాలు కొట్టుకున్నారు. చెదురు మదురు సంఘటనలు జరిగాయి. దాంతో కేంద్రం రంగంలోకి దిగి రెండు రాష్టాలు నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో నవంబర్ 28 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ఓ వీడియో కాన్ఫరెన్సు లో రెండు రాష్ట్రాలకూ కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా క్లాస్ పీకారు. ఈ వివాదం మరింత ముదరకుండా కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు డ్యాంను పహారా కాస్తాయని, రెండు రాష్ట్రాలు ఒప్పందం ప్రకారం నీటిని తీసుకునేలా చేస్తాయని భల్లా తెలిపారు.
ఏపీ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా డ్యామ్ సైట్ లోకి చొచ్చుకు వచ్చి సీసీ టీవీ కెమెరాలను పగులగొట్టి, గేట్ నెంబర్ 5, 7ల దగ్గర హెడ్ రెగ్యులేటర్స్ ఓపెన్ చేసి ఐదు వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయారని తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రభుత్వం చర్యల వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, హైదరాబాద్ ,చుట్టు పక్కల ప్రాంతాల తాగునీటి సరఫరాకు దీనితో తీవ్ర ఆటంకం ఏర్పడి రెండు కోట్ల మందికి తాగునీరు అన్నది లేకుండా పోతుందని ఆ నోట్ లో శాంతి కుమారి తెలిపారు. ఏపీ పోలీసులపై నల్గొండలో రెండు కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలు చేసినా, ఎన్నికల ముందు సెంటిమెంట్ రాజకీయాలను రగిలించడమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లూ లేని గొడవ ఒక్క రాత్రిలోనే జరుగుతుందా? ఏపీ పోలీసులు షరా మామూలుగానే నీటిని విడుదల చేసుకుని వెళ్లినా… తెలంగాణ పోలీసులు అనవసరంగా హడావుడి చేశారన్నది మరికొందరి భావన.