గంగ యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పుణ్యనదులు మనదేశంలో ఉన్నాయి. ఇవి అన్ని విధా లుగా ప్రసిద్ధి చెందిన నదులు. అయితే యావద్భారతమూ భక్తిశ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో పూజించుకునే ఒక అవతార పురుషుని జీవితంతో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఈ నదులకు లేదు. అటువంటి మహద్భాగ్యం పట్టిన నది కేవలం సరయూనది ఒక్కటే .
కోసల రాజులకు కన్న తల్లి
పైన పేర్కొన్న నదుల్లా పరిమాణంలో అంత పెద్దదికాదు సరయూ. అయితే రామునితో ఉన్న అనుబంధం వల్ల అది రామాయణంలోకి ఎక్కి విశ్వవిఖ్యాతి చెందింది. రాముడూ, రామునికి తాతముత్తాతలైన ఇక్ష్వాకు రాజులూ సరయూ తీరంలో యూపస్తంభాలు నిలిపి ఎన్నో యజ్ఞాలు చేసి తరించారు. దశరథుని తండ్రి అయిన అజమహారాజు సరయూ-గంగా సంగమం వద్ద దేహం విడిచాడని కాళిదాసు తన రఘువంశంలో పేర్కొన్నాడు.
దశరథమహారాజు సరయూ, తమనీనదుల తీరం వెంబడి ఎత్తైన స్వర్ణ స్తంభాలు నాటించాడని, ఆ నదీతీరాలను అందంగా తీర్చిదిద్దించాడని కూడా కాళిదాసు రాశాడు. దశ రథుడు అశ్వమేథయాగానికి సంకల్పించినప్పుడు, సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటికను ఏర్పాటు చేయించమని వసిష్ఠా దులు సలహా ఇస్తారు. కోసల రాజులంతా సరయు నదిని తమ కన్నతల్లిలా ప్రేమించేవారు. ఆ నదీజలాలు వారికి తల్లిపాలతో
రాముడు ప్రేమించిన నది
రాముని పేరులానే అందమైన, వినసొంపైన, మృదుమధుర మైన పేరు సరయూ. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్యం సరయూ తీరంలోనే గడిచింది. అయోధ్య రాజప్రాసాదాల నుంచి చూస్తే తన అలల చేతులతో కేరింతలు కొడుతూ ప్రవహించే సరయూ నది, దాని ఇసుక తిన్నెల మీద రాజహంసలూ కనిపించే వట. ఇక్ష్వాకు రాజులకు సరయూ నదితో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, అరణ్యవాసంలో ఉన్న రాముడు తండ్రి మర ణించిన విషయం తెలిసి దుఃఖిస్తూ, తన తల్లి కౌసల్యలానే సరయూనది కూడా దశరథ వియోగదుఃఖంతో తల్లడిల్లుతూ ఉంటుందనీ, ఎంతోకాలంగా దూరంగా ఉన్న తనను కూడా తన అలల హస్తాలతో రారమ్మని పిలుస్తోందనీ అనుకుంటాడు.
బల-అతిబల
రామాయణంలో ఇలా సరయూనది ప్రస్తావన చాలాచోట్ల కనిపిస్తుంది. విశ్వామిత్రుడు తన యాగసంరక్షణార్థం రామ లక్ష్మణులను వెంటబెట్టుకుని శిష్టరక్షణ – దుష్టశిక్షణ అనే తన అవతార కార్యాన్ని నిర్వర్తించడానికి అవసరమైన బల-అతిబల అనే రెండు మహత్తరమైన మంత్రాలను ఉపదేశించాలన్న సంకల్పం విశ్వామిత్రునికి అక్కడే, అప్పుడే కలిగింది. సరయూ నదీజలాలతో రామునితో ఆచమనం చేయించి, ఆ రెండు మంత్రాలనూ ఉపదేశిస్తాడు. ఈ మంత్రాల ప్రభావం వల్ల నీకు అలసటకానీ, ఆకలిదప్పులు కానీ ఉండవనీ, బాహుబలంలో, సౌందర్యంలో, బుద్ధికుశలతలో, వాద ప్రతివాదాలలో నీకు సరి సమానమైనవాడు ముల్లోకాలలోనూ ఉండడని చెబుతాడు. ఆ విధంగా రాముని జీవితంలోని గొప్ప పరిణామానికి సరయూనది సాక్షిగా నిలిచింది.
గంగా-సరయూ సంగమం
సీతా రామలక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రాత్రికి ముగ్గురూ అక్కడే నిద్రించి, సరయు నదీ తీరం లో మరునాడు బయలుదేరి గంగా-సరయూ సంగమం వద్దకు వెడతారు. అది పరమశివుడు తన మూడవ కంటితో మన్మథుని దగ్ధం చేసినచోటు. మన్మథుడు తన అంగాన్ని కోల్పోయి అనంగుడైన చోటు కనుక ఈ ప్రాంతం అంగదేశం అయింది. పరమశివుడు తపస్సు చేసుకున్న అక్కడి పుణ్యాశ్రమంలో విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ రోజు గడిపి, మరునాడు గంగానదిని దాటి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. మరునాడు ఉదయమే ఆశ్రమవాసులు వీరికోసం ఒక నావను సిద్ధం చేస్తారు.
వీరు నావను ఎక్కి నది మధ్యలోకి వెళ్ళేసరికి, నీళ్ళు ఎంతో ఒరవడితో ప్రవహిస్తున్నట్టు పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దమేమిటని రాముడు ఆశ్చర్యంగా అడిగినప్పుడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గంగానదిలోకి, ఎంతో దూకుడుగా, శబ్దం చేస్తూ సరయూనది వచ్చికలుస్తోందని విశ్వామిత్రుడు చెబుతాడు. ఆ తర్వాత సరయూనది పుట్టుక గురించి చెప్పి రామలక్ష్మణులకు ఆ నదికి ప్రాణామాలు అర్పించవలసిందిగా
చెబుతాడు.
మానససరోవరం నుంచి…
విశ్వామిత్రుడు చెప్పిన సరయు వృత్తాంతం ప్రకారం, బ్రహ్మదేవుడికి ఒకసారి కైలాస పర్వతం మీద ఒక సరస్సు ఉంటే బాగుంటుందని అనిపించింది. మనసులో అందుకు సంకల్పించుకున్నాడు. వెంటనే అక్కడ సరోవరం అవతరించింది. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కనుక అదే మానస సరోవరం అయింది. ఆ సరస్సు నుంచే సరయూనది పుట్టి ప్రవహించింది.
అవతార పరిసమాప్తికి సాక్షి
శ్రీరామచంద్రుడు అవతరణ ఘట్టాన్నీ, ఆయన బాల్య విశేషాలను, రాజ్య వైభవాన్నీ అతిదగ్గరగా కళ్ళారా దర్శించి ఆనందించిన సరయూనది, చివరకు ఆయన అవతార సమాప్తినీ అంతే దగ్గరగా దర్శించిన అపురూపసాక్షి కూడా. శ్రీరాముని ఉనికి వల్ల ఎంతో కాలంపాటు ఉప్పొంగిన ఆనందంలా ప్రవ హించిన సరయూ, ఆయన అవతార సమాప్తిని దర్శించి హఠా త్తుగా ఎంతటి శోకసాగరమైపోయిందో! ఉత్తరరామాయణం అభివర్ణించిన రాముని మహాప్రస్థాన ఘట్టం ఇలా ఉంటుంది.
రాముడు శరీరం మీద స్వల్పమైన అచ్ఛాదనతో, వేళ్ళమధ్య దర్భలను పట్టుకుని వైదిక మంత్రాలు జపిస్తూ, సరయూనదివైపు సాగాడు. ఋషులు, బ్రాహ్మణులు, అంతఃపురంలోని ప్రతి ఒకరూ, భరత శత్రుఘ్నులు, అయోధ్యలోని సమస్తజనులూ, వానరులూ రాముని వెంట వెళ్ళారు. ఆ సమయంలో అయో ధ్యలో ఒక్క ప్రాణి కూడా మిగలలేదు. చివరకు పశువులు, పక్షులూ కూడా రామునితో వెళ్ళాయి.
సరయూలో మునిగి దివ్యలోకాలకు….
రాముడలా నడిచి పశ్చిమంగా ప్రవహిస్తున్న సరయూనదిని దర్శించాడు. సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ నదిని సమీపించాడు. అదే సమయానికి దేవతలతో, మహర్షులతో కలసి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. రాముని విష్ణుదేవునిగా సంబోధించి, నీ తమ్ములతో కలసి నీ దివ్య రూపాన్ని ధరించు అని ప్రార్థించాడు. రాముడు అలాగే చేసి, తన మీద ప్రేమతో తన వెంట వచ్చిన వారందరికీ పుణ్యలోకాలు కల్పించమని బ్రహ్మను కోరాడు. నిన్ను ఆశ్రయించిన పశుపక్ష్యాదులతో సహా అందరూ ‘సంతానకాలు’ అనే దివ్య లోకాలు పొందుతారని బ్రహ్మ హామీ ఇచ్చాడు. అప్పుడు రాముని వెంట వెళ్ళిన వారందరూ సరయూ తీరమైన ‘గోప్రతా’రానికి చేరి అందులో మునిగారు. వెంటనే వారికి దివ్యదేహాలు లభించాయి. దేవ విమానాలను అధిరోహించి దివ్యలోకాలకు వెళ్ళిపోయారు.
ఉత్తర రామాయణం రాముని మహాప్రస్థాన ఘట్టాన్ని ఇలా పేర్కొన్నప్పటికీ, రాముడు సరయూనదిలో మునిగి అవతారం చాలించాడన్న అభిప్రాయమూ ప్రచారంలో ఉంది. ఏది ఏమై నప్పటికీ, రాముని జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన సరయూనది, ఆ మహనీయుడితో సమానంగా చిర స్థాయినీ, పవిత్రతనూ సంతరించుకుంది.
గోగ్రాకు ఉపనది
ఇంతటి చరిత్ర, విశిష్టత ఉన్నప్పటికీ సరయూనది పరి మాణంలో ఒక ఉపనది మాత్రమే. పదమూడు వేల అడుగుల ఎత్తున్న హిమాలయాలలో గంగోత్రి వద్ద పుట్టిన గంగానది శివాలిక్ పర్వతశ్రేణుల మీదుగా ప్రవహించి మైదాన ప్రాంతం చేరి తూర్పుకు తిరిగి ఉత్తరప్రదేశ్, బీహార్ ల మీదుగా సాగుతూ యమున, గోమతి, గంగోత్రి, గోగ్రా, శరదా, గండకీ, శోణ, వోశీ అనే నదులను తనలో కలుపుకుంటుంది. వీటిలో గోగ్రా నదికి గల ఉపనదులలో సరయూ ఒకటి.
రామాయణమేకాక, మహాభారతమూ, స్కాందపురాణమూ కూడా సరయూనది మానససరోవరంలోనే పుట్టిందని చెబు తున్నాయి. ఈ మానస సరోవరం వైద్యుతగిరి’ మీద ఉన్నట్టు పేర్కొన్నాయి. మానససరోవరం వద్ద సరయూనదిలో యక్షుల భార్యలు స్నానాలు చేస్తూ ఉంటారట. అయితే నేటి మన భౌగోళిక పరిజ్ఞానం ప్రకారం సరయూనది కుమోవ్ లేదా కుమయూన్ పర్వతాలలో పుట్టింది.
వేదాలు పేర్కొన్న నది
రామాయణంలోనే కాకుండా వేదాలలో కూడా సరయూనది ప్రస్తావన కనిపించడం చెప్పుకోవలసిన మరో విశేషం… ఋగ్వే దంలో మూడుచోట్ల సరయూనది ప్రస్తావన ఉంది. యయాతి కొడుకులైన యదువు, తుర్వసుడు అనేవారు సరయూనదిని దాటి వెళ్ళి చిత్రారధుడు, అర్ణుడు అనే శత్రువులను జయించి నట్లు ఋగ్వేదం పేర్కొంది. ఒక మహాయజ్ఞానికి ఇరవై ఒక్క నదులను ఆహ్వానించారనీ, వాటిలో సరయూ ఒకటని ఋగ్వేదం మరో చోట పేర్కొంది. అయితే వేదాలలో పేర్కొన్న సరయూ నది, అయోధ్యలోని సరయూ నది ఒకటి కావనే అభిప్రాయమూ ఉంది. వేదాలలో పేర్కొన్న సరయూ నది పంజాబ్లో ఉందనీ, శతదృ, విపాసా నదుల సంగమాన్నే సరయూగా పేర్కొన్నారనీ వీరివాదం. కానీ, వేదాలు పేర్కొన్నది. అయోధ్యలోని సరయూ నదినేనన్నది ఎక్కువ మంది బలపరిచిన వాదం.
సభాపర్వంలో…
మహాభారతంలోని సభాపర్వంలో, భీష్మపర్వంలో కూడా సరయూ ప్రస్తావన ఉంది. సభాపర్వంలో, జలానికి అధిదేవత అయిన వరుణదేవుని సభను వర్ణిస్తూ, భూమండలంలోని సకల సముద్రాలు, నదులూ విచ్చేసి ఆయనను అర్చించుకుంటూ ఉంటాయని చెబుతూ, ఆ నదులలో సరయూనది కూడా ఒకటని చెప్పారు. జరాసంధుని సంహరించడానికి కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని వెడుతూ సరయూ నదిని దాటి జరాసంధుని రాజధాని అయిన గిరివ్రజానికి చేరుకుంటాడు.
సరయూ తీర్థాలు
స్కాందపురాణం సరయూనదిని ఎంతో పవిత్రమైనదిగా వర్ణించింది. ఈ పురాణం ప్రకారం, సరయూనది విష్ణువు ఎడమకాలి బొటనవేలు నుంచి పుట్టింది. సరయూనదీ తీరంలో ఎన్నో ఋష్యాశ్రమాలుంటాయని కూడా ఈ పురాణం పేర్కొంది. సరయూనదిలో ఒక్కసారి మునిగినా బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు కూడా అంతరిస్తాయనీ, సరయూ-గోగ్రా సంగమస్నానం మరింత పుణ్యప్రదమనీ స్కాందపురాణం చెప్పింది. అలాగే సరయూ తీర్థాలైన బ్రహ్మకుండం, చక్రతీర్థం, గోప్రతారం, స్వర్ణద్వారాల వద్ద స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుందనీ, సరయూతీరంలో అన్నదానం, హోమం, జపం వల్ల విశేష ఫలితముంటుందని కూడా స్కాందపురాణం పేర్కొంది.
బౌద్ధ, జైనులకు పవిత్రమే
విశేషమేమిటంటే, అయోధ్యానగరమూ-సరయూనదీ హిందువులకేకాక బౌద్ధులకూ, జైనులకూ కూడా ఎంతో పవిత్రమైనది కావడం. బౌద్ధ వాజ్ఞ్మయం అయిదు గొప్ప నదులను పేర్కొంటూ వాటిలో సరయూ ఒకటని చెప్పింది. మిళింద ప్రశ్న అనే బౌద్ధ గ్రంథం కూడా సరయూను గొప్పనదిగా పేర్కొంది. బౌద్ధులు సరయూను ‘సరభు’ అని పిలుస్తారు. అయోధ్య మనదేశంలోని ఏడు మోక్ష నగరాలలో ఒకటి అయినట్లే బౌద్ధులకూ, జైనులకూ కూడా పవిత్రస్థలమే. గౌతమ బుద్ధుడు ఆరు చాతుర్మాస్యలు అయోధ్యలోనే జరిపాడు. మహర్షుల ఆంతర్యం
మానవులకేకాక, పశుపక్షులకు కూడా దాహం తీరుస్తూ, పంటపొలాలను పోషించడం ద్వారా అన్నం పెడుతున్న నదులను మన ఋషులు, కవులు కేవలం జలవనరుగా చూడలేదు. జలదేవతలుగా భావించి ఆరాధించారు. వాటిని స్తుతించారు. తమ వేదమంత్రాలలో, కావ్యాలలో వాటిని పేర్కొని తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. వారి దృష్టిలో నదులలోని జలం పాలతో, తేనెతో సమానమైనది. నదులకు కూడా వారు మానవరూపం కల్పించి మనిషితో చుట్టరికాన్ని కలుపుకున్నారు. మన మహ ర్షులు, మహాకవులు దృష్టిలో ప్రకృతిలోని ప్రతి వస్తువూ, ప్రతి జీవీ మనకు ఆత్మీయ బంధువే.
రామాయణంలో రాముడూ సరయూనదిని అలాగే భావించాడు. ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతి సంపదను గౌరవిస్తూ ప్రకృతిలో భాగంగా మనం జీవించాలని చెప్పడమే మన పూర్వుల ఆంతర్యం. ఒక మహాపురుషుని మహోదాత్త జీవిత క్రమానికి సాక్షిగా, యజ్ఞ యాగాదులకు వేదికగా అత్యంత పవిత్రతను పొందిన సరయూ నదిని భక్తితో స్మరించుకుంటేనే పాపాలు పటాపంచలవు తాయనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఇక ఆ నదిలో స్నానం చేస్తే కలిగే ఫలితం గురించి వేరే చెప్పాలా?!