నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్బీఐ(SBI) శాఖలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు బ్యాంకు ఉద్యోగే ఖాతాదారుడి సొమ్మును కాజేయడం సంచలనం సృష్టించింది. కస్టమర్ అకౌంట్లో ఉన్న రూ. 14 లక్షలను విడతల వారీగా అత్యంత నేర్పుతో తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఇందులో బ్యాంకు ఉద్యోగి హస్తం ఉందని తేలడంతో బాధితులు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాదు గతంలో ఇదే బ్యాంకులో మరో కస్టమర్కు నకిలీ ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రం ఇచ్చిన సంఘటన కూడా ఇటీవల వెలుగు చూసింది. దీంతో న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు.
బ్యాంకు ఖాతాదారుడికి సేవలు అందించాల్సిన బ్యాంకు ఉద్యోగి వారి డబ్బును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగింది. డబ్బు కోసం బాధితుడు బ్యాంకుకు రాగా అసలు విషయం బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తాడురుకు చెందిన వినోద్ కుమార్ కు అచ్చంపేటలోని ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. కొద్ది నెలల క్రితం అతను తన ఎక్కౌంట్ లో రూ.14.73 వేలు జమ చేశాడు. ఈ మధ్య అతనికి డబ్బు అవసరం వచ్చింది. దీంతో అతను సెప్టెంబర్ 29న బ్యాంకుకు వెళ్లాడు.
డబ్బులు లేవు అని షాకైన వినోద్…
లక్ష కోసం విత్ డ్రా ఫామ్ పూర్తి చేసి క్యాషియర్ కు అందించాడు. ఖాతాను చెక్ చేసిన క్యాషియర్ అందులో డబ్బు లేదని చెప్పాడు. దీంతో షాకైన వినోద్ కుమార్ తన ఖాతాలో రూ.14 లక్షలకు పైగా డబ్బు ఉండాలని చెప్పాడు. దీంతో క్యాషియర్ ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. వినోద్ కుమార్ కూడా మేనేజర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మేనేజర్ బ్యాంకులో అంతర్గంత విచారణ చేశారు. వినోద్ కుమార్ ఖాతా నుంచి సెప్టెంబర్ 5న రూ.6 లక్షలు, ఆ తర్వాత రూ.5 లక్షలు, 6 తేదీన రూ.3 లక్షలు బ్యాంకు ఉద్యోగి తన ఖాతాలోకి బదీలీ చేసుకున్నట్లు తేలింది.
తప్పు చేసింది బ్యాంక్ ఉద్యోగే … (SBI)
ఈ విషయమై బ్యాంకు మేనేజర్ బాధితుడితో మాట్లాడారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా తన ఖాతాలో నగదు జమ కాలేదని వినోద్ కుమార్ వాపోతున్నాడు. ఉప్పునుంతల సర్పంచ్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం బాధిత కుటంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ కృష్ణయ్య బ్యాంకు మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడాడు.ఓ ఉద్యోగి తప్పు చేసినది నిజమేనని విచారణలో తేలిందని బాధితుడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.
మెస్సేజ్ పొందే ఏర్పాటు చేసుకోవాలి
బ్యాంకు ఖాతా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీ మీ ఫోన్ నంబర్ ఇవ్వాలి. మీకు ఎప్పటికప్పుడు మేసేజ్ వచ్చేలా చూసుకోవాలి. అంతే కాకుండా బ్యాంక్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని మీ డబ్బును కనీసం వారానికి ఒకసారి అయినా చెక్ చేసుకోవాలి. మినీ స్టేట్ మెంట్ చూస్తూ ఉండాలి. అందులో డబ్బు ఎవరికి ఏ తేదీన పంపామో కనిపిస్తుంది. ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. బ్యాంకు కస్టమర్లందరూ విధిగా ఈ సూచనలు పాటిస్తే సమస్యలే రావు.