(brs)
తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ నేత మాత్రమే కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. మిత్రుడు కూడా. తెలుగుదేశం పార్టీ నుంచి వారి మధ్య స్నేహబంధం కొనసాగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. వెనువెంటనే ఆయనను ఎమ్మెల్సీ చేసి తన కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకోవడంతో తుమ్మలకు ప్రయారిటీ ఇక తగ్గదని గులాబీ పార్టీ నేతలందరికీ అర్థమయింది. ఆ తర్వాత జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలను పోటీ చేయించారు కేసీఆర్. అక్కడ గెలవడంతో మరోసారి 2018 ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించారు.
కేసీఆర్ సన్నిహితుడిగా…
అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక అంతే. ఆయనను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. పోటీ చేసి ఓడిపోయిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఆయనను పదవులకు దూరం పెట్టారని పార్టీ వర్గాలు చెబుతాయి. దాదాపు ఐదేళ్ల కాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పదవులకు దూరంగానే ఉంటున్నారు. తనను కేసీఆర్ ఏదో రూపంలో లైమ్ లైట్ లో ఉంచుతాడని భావించిన తుమ్మలకు నిరాశ ఎదురయింది. ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు అనేకం భర్తీ అయినా తుమ్మల పేరును మాత్రం గులాబీ బాస్ పరిగణనలోకి తీసుకోలేదు.
టిక్కెట్ ఆశించి… (brs)
కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మినహా పెద్దగా రాజకీయంగా కూడా ఆయన యాక్టివ్ గా లేరు. ఇప్పుడు మరోసారి తుమ్మల ఆశించి భంగపడ్డారు. కేసీఆర్ ఈసారైనా తనకు పాలేరు టిక్కెట్ ఇస్తారని గట్టిగా నమ్మారు. కానీ ఆయన పేరు జాబితాలో లేకపోవడంతో ఆయన అనుచరులు కూడా హాట్ హాట్ గా ఉన్నారు. పార్టీ మారాల్సిందేనని తుమ్మలపై వత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆత్మీయ సమావేశాల్లో సయితం వత్తిడి తెస్తున్నారు. అనుచరులు, సన్నిహితుల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి తుమ్మలది. అందుకే ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.
ఏం చేయబోతున్నారు?
కానీ తుమ్మలను అంత సులువుగా తీసుకునే పరిస్థితి లేదు. ఒక సామాజికవర్గం ప్రతినిధిగా తుమ్మలను చూస్తారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఒక సామాజికవర్గం ఓటర్లు కారు పార్టీ వైపు మొగ్గు చూపాలంటే తుమ్మల అవసరం ఉంటుంది. కానీ కేసీఆర్ వ్యూహమే ఇక్కడ అర్థం కాకుండా ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నప్పటికీ ఆయనకు ఆ వర్గంలో అంతటి పట్టు లేదన్నది వాస్తవం. తుమ్మల విషయంలో కేసీఆర్ తలొగ్గుతాడని అందరూ భావించినా రివర్స్ లో కేసీఆర్ ఆలోచించడం వెనక ఏమయి ఉంటుందా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. అలాగే తుమ్మలతో ఎంపీ నామా నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అప్రమత్తమయిన కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలతో నేడు భేటీ కానున్నారు. తుమ్మల ఎఫెక్ట్ జిల్లాలో పెద్దగా పార్టీపై పడకుండా ఏమేం చర్యలు తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు తుమ్మల ఏ పార్టీ లోకి వెళతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ లోకే వెళ్లాలని అనుచరులు వత్తిడి చేస్తున్నా అక్కడ కూడా సీనియర్ నేతలు ఉండటంతో ఆయన చేరిక అనుమానమే అనేవాళ్లు అనేక మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. (brs)