ఉచిత హామీలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఐదు అంశాలతో కూడిన గ్యారంటీ కార్డును అమలు చేయాలంటే నిధులు అవసరం. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయల పైనే అవసరమవుతుంది. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి, గృహలక్ష్మి, రేషన్ సరుకుల పెంపుదల, విద్యుత్తులో రాయితీల వంటి వాటిని అమలు చేయడం కష్టసాధ్యమయిపోతుందని అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తించారు. ఆ నిధులను భర్తీ చేసేవిధంగా చర్యలు ప్రారంభించారు.
తొలి బడ్జెట్ లో…
కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొట్ట మొదటి బడ్జెట్ కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ కార్డును అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేలా బడ్జెట్ కు రూపకల్పన చేసింది. వార్షిక బడ్జెట్ ను 3,27,747 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,50,993 కోట్లు కాగా, మూలధన వ్యయం 54,374 కోట్లగా చూపించారు. తొలి బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. విద్యారంగానికి 37,587 కోట్ల నిధులను కేటాయించింది. మహిళ శిశు సంక్షేమానికి 24,166 కోట్ల రూపాయలను కేటాయిస్తూ సిద్ధరామయ్య బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
మద్యం ధరలపై…
రెవెన్యూలోటును భర్తీ చేయడానికి కర్ణాటకలో మందుబాబులకు సిద్ధరామయ్య సర్కార్ షాక్ ఇచ్చింది. బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును పది శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాసనసభలో సిద్ధరామయ్య ప్రకటన చేశారు. దీంతో కర్ణాటకలో బీర్లు మండిపోనున్నాయి. బీర్లప్రియులకు హస్తం పార్టీ కిక్కు దింపేలా డెసిషన్ తీసుకుంది. పది శాతం ఎక్కైజ్ పన్నును పెంచడం కారణంగా రాష్ట్ర ఖజానకు 1200 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనావేసి మరీ ట్యాక్స్ ను పెంచింది. కర్ణాటకలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం ద్వారానే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుంది. అందుకే మద్యం ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది సిద్ధూ లక్ష్యంగా కనిపిస్తుంది. ఉచిత పథకాల అమలుతో ఇప్పటికే 200 యూనిట్లు దాటి వాడే వారిపై భారం మోపిన కర్ణాటక ప్రభుత్వం తాజాగా మందుబాబులకు కూడా కిక్కు దిగే నిర్ణయం తీసుకుంది.
Follow Us On : YouTube , Google News