ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తును కోర్టులు నిర్ణయించే పరిస్థితి ఎదురవడంతో టీడీపీ(tdp) అభద్రతా భావంలో పడిపోయింది. ముంచుకొస్తున్న ఎన్నికలు .. చెదిరిపోతున్న కేడర్.. క్లియర్ గా కనిపిస్తున్న నాయకత్వ లోపం.. సందట్లో సడేమియాలో జనసేన ఎంట్రీ.. తెలుగు తమ్ముళ్లకు టీడీపీలో ఏం జరుగుతోందో అర్ధం కాటం లేదు.. పార్టీని పెట్టాక దాన్ని ఎలా నడపాలో తెలీక ఈడ్వ లేక ఈడ్వ లేక నానా అగచాట్లూ పడుతున్న జనసేన బాబు అరెస్టు పట్ల మాత్రం లోలోన సంతోషించే ఉంటుంది. అందుకే పవన్ కల్యాణ్ ఒక్క పరుగున జైలుకెళ్లి మరీ ములాఖత్ అయ్యారు. రిమాండ్ లో ఉన్న బాబును తన మాటలతో,స్నేహ బంధంతో బంధించేశారు. కలసి పోటీకి చంద్రబాబును ఆలోచించుకునే తీరిక కూడా ఇవ్వకుండా ప్రకటించేశారని, అందునా అమవాస్య నాడు ఏకపక్షంగా ప్రకటన చేసేశారని టీడీపీలో ఆందోళన పెరిగిపోతోంది. జనసేనను టీడీపీయే తమ ఉక్కు కౌగిలిలో బంధించిందేమోనని అక్కడ బీజేపి హై కమాండ్ లో అనుమానాలు.. ఆ పాపం మాది కాదంటూ వివరించడానికే లోకేష్ ఢిల్లీ యాత్ర…
ఈ గందరగోళం మధ్య బాబుగారిని బయటకు తెచ్చేందుకు టీడీపీ(tdp) నిరసనలు, దీక్షలు అంటూ హడావుడి చేస్తోంది. ఈ హడావుడి పొరుగు రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఐటీ కేరాఫ్ నేనే అని చెప్పుకునే చంద్రబాబు కోసం ఐటీ ఉద్యోగులంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇది చాలదన్నట్లు అటు బెంగుళూరులోనూ ఐటీ ఉద్యోగులు రోడ్డుకెక్కారు. ఆయన్ను అన్యాయంగా జైలు పాల్చేశారని నినాదాలు చేస్తున్నారు.
బాబు కాబట్టి వదిలేయాలా? (tdp)
అసలు ఈ నినాదాలు చేసేవారి ఆంతర్యం ఏంటన్నది అర్ధం కాటం లేదు. ఏపీ సీఐడి కక్ష పూరితం గానే ఈ కేసు పెట్టిందని ఇప్పటికీ మెజారిటీ జనం నమ్ముతున్నారంటే ఆ సామాజిక వర్గ మీడియా ప్రజలను ఎంతలా ప్రభావితం చేస్తోందో అర్ధం చేసుకోవచ్చు.. ఆయన తిరుగులేని సాక్ష్యాలతో అడ్డంగా దొరికారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పిస్తున్నామని అంటున్నారు. ఇక టీడీపీ శ్రేణులకు భయం ఎందుకు? చంద్రబాబు అసలు తప్పు చేయరా? పొరపాటు చేయరా? వీళ్లందరికీ అంత గురి ఆయనపై ఎందుకు కుదిరింది? పోనీ ఆయన సచ్చీలుడనే అనుకున్నా.. కోర్టులు ఆ విషయం తేలుస్తాయి.. ఈలోపే ఎందుకు వీధులకెక్కి నిరసనలు, ఆందోళనలు.? ప్లకార్డులు పట్టుకుని రోడ్డుకెక్కిన వారిలో ఒక్కరికైనా అసలా కేసు పూర్వపరాలు తెలుసా? చట్టాలకు విరుద్ధంగా నిధుల మనీ లాండరింగ్ ఎలా జరిగిందో ఎవరైనా ఆసాంతం చదివారా? అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారా? చంద్రబాబు ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించారు కాబట్టి ఆయన తప్పు చేసినా అరెస్టు చేయకూడదు అన్నది వాళ్ల భావనా?
చంద్రబాబు బొక్క బోర్లా పడ్డారా? (tdp)
చంద్రబాబు తలపండిన రాజకీయ మేధావే.. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేతే .. కాదనం..కానీ ఒక్కోసారి బ్రహ్మకి కూడా రిమ్మ తెగులు పట్టినట్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తాయి. అందరం మానవ మాత్రులమే కాబట్టి ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయ్.. అలాంటి పొరపాటో, నిర్లక్ష్యమో జరిగి చంద్రబాబు ఈ కేసులో ఇరుక్కుపోయి ఉండొచ్చు. అధికారులు తప్పు చేసి బాబుపైకి నెట్టేశారన్నది కొందరి భావన. ఆయన సీఎం హోదాలో ఏకంగా 13 చోట్ల ఆ డీల్ ను స్వయంగా అంగీకరిస్తూ సంతకాలు కూడా చేశారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఐటీ ఉద్యోగుల ప్రార్ధనలు ఫలించి రేపు విచారణలో సీఐడీ పోలీసుల సాక్ష్యాలు కోర్టులో వీగిపోయో, చెల్లకో ఆయనపై కేసు కొట్టేసే ఆస్కారం కూడా ఉండొచ్చు.. అప్పుడాయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అప్పటి దాకా ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు?పేరున్న లాయర్ సిద్ధార్ధ లూథ్రా కు కోట్లకు కోట్లు సమర్పించుకున్నా, 23 మంది సీనియర్ న్యాయవాదుల బృందం చెమటలు కక్కేలా గంటల తరబడి వాదించినా ఆయన అరెస్టు తప్పలేదు అంటే అక్కడ అంత పకడ్బందీ ఆధారాలు దొరికాయనుకోవాలా?. టీడీపీ శ్రేణుల్లో కలవరం, లోకేష్ లో అసహనం, బాలయ్యలో అయోమయం చూస్తుంటే కేసు చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తోంది.. ఈనెల19న చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది. ఆయనకు బెయిల్ వస్తే ఊరటే.. బయట ఉండి పోరాడొచ్చు..లేదంటే జైలునుంచే వ్యూహాలు పన్నుతూ అటు పార్టీని,తనని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.
ఇదెక్కడి వింత వాదన?
ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో ఐటీ ఉద్యోగులు,టీడీపీ అభిమానుల వింత వాదన విచిత్రంగా ఉంది.. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ వల్ల లక్షలమందికి ఉద్యోగాలొచ్చాయట..కావాలంటే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తారుట.. బాబుగారిని మాత్రం విడిచి పెట్టాలంటూ వింత వాదనలు చేస్తున్నారు మరికొందరు. తప్పు ఎక్కడైనా తప్పే.. నిజంగా చట్టపరంగా చంద్రబాబు శిక్షార్హుడైతే కోర్టులు నిర్ణయిస్తాయి.. శిక్ష విధిస్తాయి. కాదంటే నిర్దోషిగా విడుదల చేస్తాయి. కనీసం అంత వరకూ తెలుగు తమ్ముళ్లు సంయమనం పాటించడం మంచిదేమో.
ఒకవేళ చంద్రబాబు అన్యాయంగా కుట్రలకు బలై జైలు పాలయినా.. న్యాయం, ధర్మం ఆయనవైపుంటే ఆయన కచ్చితంగా పులుకడిగిన ముత్యంలా బయటకొస్తారు..చరిత్ర ఉన్నన్నాళ్లూ ఆయన ఖ్యాతి నిలిచిపోతుంది. లేదూ ఆరోపణలు నిజమై, ఆధారాలు దొరికితే శిక్ష అనుభవించక తప్పదు. అసలది నేరమా కాదా అన్నది న్యాయపరంగా తేలాలంటే కొన్నేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పదేళ్లవుతున్నా ఆ కేసుల అతీ గతీ లేదు…