కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన సోమావతీ అమావాస్య
అమావాస్య! సోమవారంతో కలసి వస్తున్నది !! బహుపుణ్య మహోదయకాలం!!
ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం!
సోమావతి అమావాస్య
సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది.అందుకే ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.
సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి:
1. సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.
2. ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
3. శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి.
4. గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.
5. వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం – సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది.
శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక సోమవారము అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…
దక్షయజ్ఞం కథ తెలుసుకుందాం ! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు.అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది.సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు.అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు.. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు.అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు.
చంద్రుడుకి శివుడు ఇచ్చిన వరం ఏంటి..?
నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు.తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు.చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు.శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది.. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.
సోమవతి అమావాస్య రోజున ఏం చేయాలి..?
సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు.ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే.. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం.ఈ పూజ పంచారామాలలో కానీ, రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట… ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.
రావిచెట్టుకు ఎందుకు ప్రదక్షిణలు చేయాలి..?
సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో వుండే సకల దోషాలు తొలగి పోతాయని విశ్వాసం.సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకం.ఈనాడు ఉపవాసము చేసిన స్త్రీ కి సంతాన భాగ్యము తో పాటు, ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం ప్రాప్తించదట. అందుకే దీనిని సోమవతి అమావాస్య అంటారు
సోమావతి అమావాస్య గురించి ఒక కథకూడా ఉంది. దాని ప్రకారం …
పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెనును ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురుంచి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లయిన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా, దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారమడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు.
మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు.వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంటతన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా, ఈ సోమావతి అమావాస్యరోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరకి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ.
అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమావతి అమావాస్య . ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. హిందూ విశ్వాసాల ప్రకారం సోమవతి అమవాస్య రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.