TDP
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత ఎవరంటే.. ఠక్కున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరే చెబుతారు. జిల్లాలో పార్టీని ఆయన శాసిస్తారు. సోమిరెడ్డి మాటలకు చంద్రబాబు కూడా గౌరవమిస్తారు. ఆ జిల్లాలో గత ఎన్నికల్లో జీరో స్థానాలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బతిన్నా సరే చంద్రబాబు వద్ద సోమిరెడ్డి పలుకుబడి పెద్దాయన వద్ద ఏమాత్రం తగ్గదు. నమ్మకంగా ఉంటూ పార్టీకి కొద్దో గొప్పో ఆసరాగా ఉన్న సోమిరెడ్డిని దూరం పెట్టడం మంచిది కాదన్నది చంద్రబాబు అభిమతం కావచ్చు. మంచైనా, చెడైనా సోమిరెడ్డి తమ పార్టీకి అందించిన సేవలను గుర్తిస్తూనే ఆయనకు సముచితమైన స్థానం కల్పించడంలో పార్టీ అధినేత ఏమాత్రం వెనకాడరు.
యువనేతకే అవకాశం….
నాలుగుసార్లు వరసగా ఓటమి పాలయినా సర్వేపల్లి టిక్కెట్ ఆయన చెప్పిన వారికే దక్కుతుంది. 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయినా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. అలాంటి చంద్రబాబు ఈసారి సర్వేపల్లి విషయంలో ఏం చేస్తారన్న చర్చ జరుగుతుంది. సోమిరెడ్డి కూడా సర్వేపల్లి నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని భావిస్తున్నారు. సోమిరెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి గత కొన్నేళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలోపర్యటిస్తున్నారు. తన తండ్రి ఆశీస్సులతో ఆయన పార్టీ ఓటు బ్యాంకు పక్కకు వెళ్లకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాజగోపాల్ రెడ్డి ప్రజాసమస్యలపై స్పందిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన సర్వేపల్లిలో చేస్తూ టీడీపీ హైకమాండ్ దృష్టిలోనూ పడ్డారు.
వేరే రూట్ లో… TDP
ముఖ్యంగా యువనేత కావడంతో ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కూడా సులువుగా దగ్గరయ్యారు. దీంతో ఈసారి సర్వేపల్లి టిక్కెట్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారన్న ప్రచారం బాగా నడుస్తుంది. అదే సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వెళ్లాలని తొలుత భావించారు. కానీ అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి చేరడంతో అది సాధ్యపడే అవకాశం లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కుమారుడిని నిలబెట్టి సర్వేపల్లి నుంచి గెలిపించుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలి పదవి చేపట్టి మంత్రివర్గంలో చోటు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వరసగా నాలుగుసార్లు…
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. ఆయన చివరి సారిగా 1999లో సర్వేపల్లి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత సర్వేపల్లి ప్రజలు ఆయన వైపు చూడలేదు. 2004, 2009 ఆదాల ప్రభాకర్ రెడ్డి, 2014, 2019 ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.అయితే మూడుసార్లకు మించి ఓటమి పాలయిన వారికి టిక్కెట్లు లేవని నారా లోకేష్ మహానాడు సందర్భంగా ప్రకటించడంతో ఆయన తాను పోటీ నుంచి విరమించుకుని తన కుమారుడికి సర్వేపల్లి టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబును కోరినట్లు తెలిసింది. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. దీంతో సోమిరెడ్డి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనట్లేనన్నది ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. చివరి నిమిషంలో మార్పు ఏదైనా జరిగితే చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే కాకాణి గోవర్థన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఢీకొనేది రాజగోపాల్ రెడ్డి అనేది స్పష్టంగా తెలుస్తోంది. TDP