శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..
కృష్ణం వందే జగద్గురుమ్.. త్రిమూర్తులలో ఒకరు అయినా సృష్టికర్త శ్రీ మహా విష్ణువు లోకాలన్నిటినీ ఉద్ధరించడానికి దశావతారాలు ఎత్తారు. అందులో ఎనిమిదవ అవతారమున శ్రీ కృష్ణునిగా(Sri Krishna) జన్మించారు. ఇది మనలో చాలా మందికి తెలుసు అలాగే శ్రీ కృష్ణుని గురించి కూడా మనకు తెలుసు అయినప్పటికీ కృష్ణుని గురించి ఎంత తెలుసుకున్న ఇంకా మిగిలే ఉంటుంది అంటారు పెద్దలు. మరికొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవడం విశ్వం అంతటి గురించి తెలుసుకోవడం రెండు ఒక్కటే అంటారు.
శ్రీ కృష్ణుని చాలా మంది ఎన్నో రూపాల్లో పూజిస్తుంటారు. బాలకృష్ణునిగా, చిలిపి కృష్ణునిగా, గోపికా వల్లభునిగా.. కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో వారి పుట్టినరోజు ను ఎంత ఘనంగా, సంతోషం గా జరుపుకుంటాము .శ్రావణ మాసం లో వచ్చే బహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు. అష్టమి తిధి నాడు కృష్ణుడు జననం జరిగింది కాబ్బటి కృష్ణాష్టమి అని అంటారు. సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ”కృష్ణాష్టమి”గా వేడుక చేసుకుంటాం. కృష్ణాష్టమిని “గోకులాష్టమి”, “శ్రీకృష్ణ జన్మాష్టమి”, “శ్రీకృష్ణ జయంతి”, “అష్టమి రోహిణి”, “శ్రీ జయంతి”, “సాతం ఆతం”, “జన్మాష్టమి” – ఇలా చాలా రకరకాల పేర్ల తో ఎంతో ఆనందం గా జరుపుకుంటారు .జన్మాష్టమి రోజు పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా!
పూజ విధానం..
శ్రీ కృష్ణా జన్మాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి . పూజగది ని శుభ్రం చేసుకొని ,ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి , గడపకు పసుపుకుంకుమల తో అలంకరించి, ఆ చిన్నికృష్ణుడి ని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు చిన్ని కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించాలని పండితులు చెబుతున్నారు.
కృష్ణునికి (Sri Krishna) తులసి అంటే చాలా ఇష్టం. రుక్మిణి సత్యభామ ల మధ్య శ్రీ కృష్ణ తులాభార ఘట్టం లో సాక్షాత్తు ఆ రుక్మిణి దేవి ఒక్క తులసి దళం తో శ్రీ కృష్ణుని ప్రేమ ను పొందింది అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు కచ్చితం గా ఉపయోగించాలాంప్ చెబుతున్నారు. శ్రీ కృష్ణుని చిత్రపటం లేదా విగ్రహానికి కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. అలాగే ఆయనకు ఎంతో ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే! అంటున్నారు పండితులు. పూజ లో భాగంగా శ్రీ కృష్ణ అష్టోత్తరం కానీ శ్రీ కృష్ణాష్టకమ్, వంటి స్తోత్రాలను పాటించి , సుగంధ భరితమైన పుష్పాలతో కృష్ణ పరమాత్ముని అర్చించాల .
పూజ నైవేద్యం..
కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం కూడా ఉంది. కాబట్టి శ్రీ కృష్ణునికి (Sri Krishna) నైవేద్యం గా వడపప్పు, పానకం, పళ్లు వంటి సమర్పిస్తారు. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాల ఉత్పత్తులు అంతే పాలు , వెన్న, మీగడ ఇలాంటివి నివేదించడం చేయాలి . మరికొందరు.. ప్రత్యేకం గా బాలింతలకు పెట్టే మినప పిండి, పంచదార కలిపిన పదార్థాన్ని నివేదన చేస్తారు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు జననం జరిగినప్పుడు ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ పదార్థాన్ని నివేదన చేస్తారట. అంతేకాకుండా శ్రీ కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల ని స్వామి వారికి సమర్పిస్తే ఆ స్వామి కృప కటాక్షాలు తప్పకుండ ఉంటాయని చెబుతున్నారు.ఎందుకంటే శ్రీ కృష్ణ- కుచేలుని కథ మన అందరికి తెలిసే ఉంటుంది.
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున అయన పూజ తో పాటు భాగవతం ,భగవద్గీతలను పట్టించడం మంచిదంటున్నారు. ఉపవాసం జాగరణ చేయదల్చిన వారు ఆ రాత్రంతా శ్రీ కృష్ణ నామ స్మరణ ని తలుస్తూ , ఆ స్వామి భజన చేస్తూ జాగరణ చేయాలట. శ్రీ కృష్ణుడు (Sri Krishna) అష్టమి తిధి నాడు అర్ధరాత్రి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి కొందరు ఆ సమయం లో కృష్ణుని పూజిస్తారట. ముందుగా కొంత బియ్యాన్ని పోసి దాని మీద ఒక చిన్న కుండ ఉంచి ఆ కుండ పై శ్రీ కృష్ణుని ప్రతిమని ఉంచి శంఖం లో నీటిని తీస్కొని చంద్రునికి , శ్రీ కృష్ణుని కి అర్ఘ్యమిస్తారుట.ఇలా జాగరణ పూజ చేసిన మరుసటి రోజు శ్రీ కృష్ణుని ఆలయం లేదా ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్లి ఉపవాసం విరమిస్తారట.
ఉట్టి కొట్టే కార్యక్రమం..
శ్రీ కృష్ణుడు (Sri Krishna) చిలిపి చేష్టల ఎన్నో ఉన్నా మనకందరికీ బాగా తెలిసింది ఉట్టి మీద ఉన్న పాలు , పెరుగు , వెన్న ని దొంగతనం గా తినడం. అందుకు చిహ్నం గా శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు చాలా ఆలయాల్లో లేదా ఏదైనా ఒక ప్రదేశం లో ఇరుగు పొరుగు వారు అంత కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమం నివహిస్తారు. ఆ ఉట్టి లో అటుకులు, పాలు, పెరుగు, వెన్న, , పళ్లులాంటి పదార్థాలు ఉంచి ఈ ఉట్టి కొడతారు.