తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫొటో షూట్ వివాదాస్పదమయింది. తనకిచ్చిన భద్రత సిబ్బందితో ఆయన ఫొటోషూట్ లో పాల్గొనడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక మంది దీనిని తప్పుపడుతున్నారు. జనాలను ఆకట్టుకోవాలంటే వేరే మార్గాలుంటాయి. అంతే తప్ప తనకు ప్రభుత్వం ఇచ్చిన భద్రతతో ఆటాడుకోవడం సరికాదంటూ అభిప్రాయం వ్యక్తమవుతుంది. నెట్టింట ఆయన వైఖరిని అనేక మంది తప్పుపడుతున్నారు.
వై కేటగిరీ భద్రత…
తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసు వెలుగు చూసిన వెంటనే ప్రభుత్వం ఆయన వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఆయన ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకుండా ప్రత్యేక వాహనంతో పాటు భద్రతను కూడా కల్పించింది. కానీ దానిని ఎమ్మెల్యే ఫొటో షూట్ కోసం వాడుకోవడం విమర్శలకు తావిస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ కనపడుతున్నాయి. భద్రత సిబ్బందిని ఇలా వినియోగించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.