ఆంధ్రప్రదేశ్ లోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జులను నియమించిన చంద్రబాబు వారినే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశముంది. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ముందస్తు ఎన్నికలపై చర్చించారని జాతీయ మీడియాలోనూ వార్తలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణతో పాటే ముందుగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలు జరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. లోక్ సభ కు కూడా ముందస్తు వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అలర్ట్ అయి అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు.
నాలుగేళ్ల నుంచి…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత నాలుగేళ్ల నుంచి దాదాపు ముఫ్ఫయి నియోజకవర్గాల ఇన్ ఛార్జులను నియమించలేదు. అక్కడ సరైన అభ్యర్థులు లేకపోవడం, సామాజికవర్గం సమీకరణ వంటి కారణాలతో ఆయన ఈ నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జుల నియామకం చేపట్టలేదు. అక్కడ నేతలందరూ కలసి చంద్రబాబు పర్యటించినప్పుడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పటికీ నియామకాన్ని మాత్రం ఖరారు చేయలేదు. ఈక్వేషన్లు సక్రమంగా లేకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టారు. అయితే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న ప్రచారంతో చంద్రబాబు మిగిలి పోయిన నియోజకవర్గాలకు కూడా ఇన్ ఛార్జులను నియమించాలని డిసైడ్ అయ్యారు.
వరస సమీక్షలతో…
మూడు రోజుల నుంచి నుంచి చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు లేకుంటే నాలుగు నియోజకవర్గాలను చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈరోజు నుంచి వరస సమీక్షలతో చంద్రబాబు బిజీగా మారనున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులతోనూ చంద్రబాబు సమావేశమై ముందస్తు ఎన్నికలు వస్తే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీనియర్ నేతల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామంటూ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత మరింత స్పీడ్ పెంచాలని నిర్ణయించారు. సర్వే నివేదికలతో పాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఎస్సీ నియోజకవర్గాలు…
ముందుగా ఎస్సీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను ఖరారు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.నిన్న తిరువూరు,పోలవరం, సూళ్లూరుపేట, సంతనూతలపాడు నియోజకవర్గాలపై సమీక్ష జరిపిన చంద్రబాబు ఈరోజు కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం కానున్నారు. మంగళవారం చింతలపూడి, గోపాలపురం, కోడుమూరు నియోజకవర్గాల సమీక్షను పూర్తి చేశారు. సమీక్ష సందర్భంగా ఇన్ ఛార్జి పదవి కోసం పోటీ ఉన్నప్పటికీ నేతలందరూ సమన్వయంతో పని చేయాలని సూచిస్తున్నారు. టిక్కెట్ దక్కకపోయినా, పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారిని పార్టీ అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. కలసి కట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించుకుని రావాల్సిందిగా నేతలకు చెబుతున్నారు.
Follow Us On : YouTube , Google News