తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించనున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికి ఈ పర్యటన చేపట్టారు. మొత్తం పది రోజుల పాటు వరసగా ప్రాజెక్టులను చంద్రబాబునాయుడు సందర్శించనున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను ఎలా నిర్లక్ష్యం చేసిందీ ప్రజలకు తెలియజెప్పడానికి చంద్రబాబు నేరుగా ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించారు.
నందికొట్కూరులో…
ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని, పాములపాడు మండలంలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటరీలను చంద్రబాబు నేడు పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి నందికొట్కూరుకు వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం…
నందికొట్కూరులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం పటేల్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్యం మూడు గంటలకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని నందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకోనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు పాములపాడు మండలంలో బనకచర్ల హెడ్ రెగ్యులేటరీకి చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా జమ్మలమడుగు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.