వెస్టిండీస్ తో T20 సిరీస్ను కోల్పోయిన భారత్ ఐర్లాండ్ తో నైనా గెలుస్తుందా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈరోజు రాత్రికి డబ్లిన్ లో జరుగుతున్న తొలి టీ 20లో భారత్ తన సత్తాను చూపించాల్సిన అవసరం ఉంది. యువజట్టుపై బీసీసీఐ పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందా? వమ్మవుతుందా? అన్నది తేలాల్సి ఉంది. రాత్రి 7.30 గంటలకు భారత్ – ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు జస్పిత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత బుమ్రా మైదానంలో అడుగుపెడుతున్నారు. చాలా రోజుల తర్వాత బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడుతున్నారు. ఐర్లండ్ తో భారత్ యువ జట్టు మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనుంది.
వెస్టిండీస్ సిరీస్…
వెస్టిండీస్ తో సిరీస్ ఓటమి పాలవ్వడంతో కొంత నీరసంగా ఉన్న జట్టు ఐర్లాండ్ తోనైనా ఆడి గెలిచి తిరిగి ఫామ్ లోకి రావాలని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐర్లాండ్ ను చిన్న జట్టు అని అంచనా వేయడానికి వీలులేదు. క్రికెట్ లో ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే ఆచితూచి చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న సామెత క్రికెట్ కు అక్షరాలా వర్తిస్తుంది. అందుకోసమే ఐర్లాండ్ తో ప్రయోగాల కన్నా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేలా భారత్ దృష్టి పెట్టాలని క్రికెట్ ఫ్యాన్స్ బలంగా కోరుతున్నారు.
అన్నీ గెలుపులే…
ఇప్పటి వరకూ ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలయిన చరిత్ర భారత్ కు లేకపోవడం ఒక సానుకూల అంశమే. ఇప్పటి వరకూ ఐదు T20లు ఐర్లాండ్ తో ఆడితే అన్ని గెలిచిన రికార్డు ఇండియాకు ఉంది. ఆ రికార్డును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత యువక్రికెటర్లపై ఉంది. ప్రపంచ కప్ నకు ముందు బీసీసీఐ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ మ్యాచ్ లకు పంపిస్తూ వారిని ట్యూన్ చేస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ లో సక్సెస్ అయిన బ్యాటర్లు, బౌలర్లకు బీసీసీఐ అవకాశమిస్తూ పోతుంది. సీనియర్లకు విశ్రాంతి నివ్వడంలో భాగంగా యువక్రికెటర్లకు కొంత అనుభవం వచ్చేలా ఈ విదేశీ టూర్లు ఉపయోగపడతాయని బీసీసీఐ అంచనా వేసి వారిని ఎంపిక చేసింది.
సత్తా చూపాల్సిందే… T20
ఈనేపథ్యంలో నేడు ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లొ యువక్రికెటర్లు సత్తా చాటాల్సిన అవరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా జట్టు బలంగానే కనిపిస్తున్నా ఐపీఎల్ లో చూపినట్లుగా ఈ మ్యాచ్ లలో యువ ఆటగాళ్లు చెలరేగిపోతారా? లేదా? అన్నది మాత్రం మైదానంలోనే తేలనుంది. చిన్న జట్టు అని తేలిగ్గా తీసుకుంటే పరాభవం మూటగట్టుకునే అవకాశాలున్నాయి. అందుకే భారత్ – ఐర్లాండ్ తొలి T20 మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బుమ్రా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులు టీంలో ఉండే అవకాశముంది.