వరల్డ్ కప్ షెడ్యూల్ ఇలా విడుదలయిందో.. లేదో.. వెంటనే వివిధ దేశాల జట్ల బలాబలాలపై అంచనాలు మొదలయ్యాయి. కొందరయితే ఏకంగా ఏ జట్లు ఫైనల్కు చేరతాయో చెప్పేస్తున్నారు. మరికొందరు మాత్రం సెమీ ఫైనల్ చేరుకునే జట్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో తమకున్న క్రికెట్ పరిజ్ఞానంతో చెప్పేస్తున్నారు. భారత్లో క్రికెట్ ఫ్యాన్స్కు కొదవే లేదు. గ్రామం నుంచి నగరం వరకూ… విద్యార్థుల నుంచి రిటైర్ అయిన వారి వరకూ బాగా ఆస్వాదించే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే.
క్రీడానిపుణుల అంచనాలు…
అందుకే క్రికెట్కు సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇప్పుడు సినీ హీరోలకంటే క్రికెటర్లకే క్రేజ్ ఎక్కువ. డబ్బుకు.. డబ్బు…ఫేమ్ కు ఫేమ్ వచ్చేది ఈ క్రీడలోనే. క్రికెట్ లో రాణించగలిగితే కొన్ని తరాలు సుఖపడినట్లే. కాసులు కురిపించే క్రికెట్ ను ఆడేందుకు ఎంతగా ఇష్టపడతారో… దానిని చూసేందుకు కూడా కోట్లాది మంది ఎదురు చూస్తుంటారు. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్కు చేరుకునే జట్లు ఇవేనంటూ మాజీ క్రికెటర్ల అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.
ఈ నాలుగు జట్లు…
భారత్లో అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబరు 19వ తేదీ వరకూ ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే టీం ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం నాలుగు జట్లు సెమీస్ కు చేరుకుంటాయని ప్రిడెక్ట్ చేశారు. ఆయన అంచనాలు కరెక్ట్ కావచ్చు… కాకపోవచ్చు. అయితే ఆ జట్లు ఎందుకు చేరతాయన్న విషయాన్ని కూడా సెహ్వాగ్ వివరించారు. సెహ్వాగ్ అంచనా ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్కు చేరతాయని చెప్పాడు.
అందుకే… సెమీఫైనల్కు….
ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నీలోకి దిగుతుంది. సో.. ఈసారి కూడా ఇంగ్లండ్ సెమీ ఫైనల్కు చేరుకునే వీలుందన్నారు. అలాగే ఆస్ట్రేలియా ఇప్పటికే ఐదు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు కూడా సెమీఫైనల్కు చేరినట్లే అని సెహ్వాగ్ అంచనా వేశాడు. ఇక భారత్ మాత్రం సొంత గడ్డపై ఆడుతుండటంతో సెమీ ఫైనల్కు చేరుకునే అవకాశాలున్నాయని చెప్పాడు. 2011 తర్వాత మళ్లీ భారత్లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఇక పాకిస్థాన్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉందని.. ఆ జట్టు కూడా సెమీస్ కు చేరుకుంటుందన్నది సెహ్వాగ్ అంచనా. ఫైనల్కు ఏ జట్టు చేరుతుందన్నది మాత్రం సెహ్వాగ్ చెప్పలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Follow Us On : YouTube , Google News