ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి ఢిల్లీ పాలిటిక్స్ కు చేరువవ్వాలని భావిస్తున్నారు. మహారాష్ట్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ వరస మీటింగ్ లు పెడుతున్నారు. మరోవైపు ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశాలకు కేసీఆర్ కు ఆహ్వానం అందలేదు. ఒకవేళ అందినా.. కేసీఆర్ వెళ్లడం డౌటు. ఆయన బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను కలుపుకుని జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావిస్తున్నారు.
రెండు పార్టీలకు వ్యతిరేకంగా…
కానీ కాంగ్రెస్ లేని కూటమి బీజేపీని ఎదుర్కొనలేదని భావించిన మిగిలిన పార్టీలు ఆ పార్టీతోనే కలసి వెళుతున్నాయి. అందుకోసమే కొద్దిరోజుల క్రితం పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి ఇరవై పార్టీల వరకూ హాజరయ్యాయి. ఈ కూటమికి కూడా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు. అలాంటి అఖిలేష్ కేసీఆర్ తో ఎందుకు భేటీ అయ్యారు? వీరి మధ్య ఏ ఏ అంశాలపై చర్చ జరిగిందన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కలసి వచ్చే….
గత ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగలేదు. ముందుగానే తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేది లేదని చెప్పడంతో అక్కడ ఒంటరిగానే పోటీ చేసింది. ఈ పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్, కేసీఆర్ లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమిని ప్లాన్ చేస్తున్నారా? కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉండటంతో వారిని కూడా కలుపుకుని వచ్చేఎన్నికలకు సమాయత్తమవ్వాలన్నఅంశంపై వీరి మధ్య చర్చకు వచ్చి ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. అఖిలేష్ యాదవ్ , కేసీఆర్ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి వాటిపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు.