JSP
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. అన్ని పార్టీలు ఎవరి ప్రచారంలో వారు బిజీగా ఉన్నారు.. డబ్బుల కట్టలు దొంగ చాటుగా తరలిపోతున్నాయి. పోలీసుల కళ్లు పడినప్పుడు మాత్రం పట్టుబడుతున్నాయి. సో.. నేతలంతా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.. లేనిదల్లా ఒక్కరే…మరో రెండు వారాల్లో ఎన్నికలుండగా హాయిగా తడిగుడ్డ వేసుకు పడుకున్నదెవరూ అంటే జనసేనాని పవన్.. బీజేపీతో పొత్తు లో ఉన్నాం కదా అంతా వారే చూసుకుంటారులే అనే ధీమానో.. లేక ఏం చేయాలో పాలుపోకనో తెలీదు కానీ, పవన్ కల్యాణ్ చాలా సైలెంట్ అయిపోయారు. ముంగిట్లో ఎన్నికలు పెట్టుకుని ఆయన కుటుంబ పెళ్లి వేడుకకు ఇటలీ వెళ్లి రావాల్సి వచ్చింది. పనులెన్ని ఉన్నా.. కుటుంబ వేడుకలకు హాజరు కాక తప్పదు కాబట్టి దాన్నెవరూ తప్పుబట్టరు. కానీ ఆ వేడుక నుంచి త్వరగానే వెనక్కు వచ్చినా పవన్ ఇంకా యాక్టివ్ గా మారలేదు.. తెలంగాణలో పోటీకి సై అంటారు సైనికులు.. కానీ నేతకు మాత్రం అయోమయం.. చేయాలో వద్దో.. చేస్తే ఎక్కడనుంచి చేయాలో? బీజేపితో పొత్తు విషయాన్ని ఎలా డీల్ చేయాలి లాంటి అంశాలపై ఆయనకు ఒక క్లారిటీ అంటూ లేదని తేలిపోయింది. పోనీ అలాంటప్పుడు ఎన్నికలకు దూరంగా ఉందామన్న నిర్ణయమూ తీసుకోలేదు. పవన్ కు ఇచ్చిన సీట్లపై గానీ, జనసేన పోటీ చేస్తున్న సీట్లలో ప్రచారం కానీ ఏవీ లేక అంతా గందరగోళంగా కనిపిస్తోంది.
ఇక్కడ వారాహి రోడ్డెక్కుతుందా? JSP
ఏపిలో ఇంకా ఎన్నికలకు ఆరు నెలలకు పైనే సమయమున్నా వారాహీ మీద యాత్రలు చేశారు పవన్.. తనదైన ఫైరింగ్ స్టైల్ లో జగన్ మీద పంచులేసి ఆవేశంతో ఊగిపోయారు. అయితే అసలు ఎన్నికలు జరుగుతున్నది తెలంగాణలో.. ఇక్కడ మాత్రం సేనాని ఎందుకో సైలెంట్ అయిపోయారు. తమ పార్టీ పోటీ చేసిన లేదా పొత్తులో ఉన్న సీట్లలో అయినా ప్రచారం చేస్తారా? వారాహి ఇప్పటి వరకూ తెలంగాణలో తిరిగింది లేదు.. ప్రచార గడువు ముగుస్తున్నా పవన్ ప్రచారంపై స్పష్టత రావడం లేదు.. బీజేపి బహిరంగ సభలో మోడీ పక్కన కూర్చుని చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారు.
గందరగోళమే వ్యూహమా?
అసలింతకీ పవన్ బీజేపి తరపున అయినా ప్రచారం చేస్తారా? లేక ఇదే గందరగోళం కంటిన్యూ చేస్తారా? వారాహీ తెలంగాణ రోడ్లపై తిరుగుతుందా లేదా? ఇప్పటికీ జనసేన మేనిఫెస్టో అంటూ ఏదీ బయటకు రాలేదు. సెటిలర్ల ఓట్లే ధ్యేయంగా బరిలోకి దిగినా వారికి కూడా ఓ మేనిఫెస్టో చూపించాలికదా.. పోనీ బీజేపీ మేనిఫెస్టోయే మాది కూడా అంటారా అంటే అదీ బయటకు అనడం లేదు. ఎన్నికల ప్రసంగాల్లో ఏం మాట్లాడాలి.? ఎవరిని టార్గెట్ చేయాలి? లాంటి అంశాలపై నో క్లారిటీ.. కేసీఆర్ ను విమర్శించడమంటే కొరివితో తలగోక్కోవడమే.. ఆ సంగతి పవన్ కు బాగా తెలుసు.. పైగా ఇక్కడ ఎన్నికల్లో ఓటమి ఆ ప్రభావం ఏపీలో కూడా చూపిస్తుందేమోనన్న భయం.. బహుశా జనసేనాని గందరగోళానికి కారణం కావచ్చు.. అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? పవన్ ఆలోచనలెలా ఉన్నా ఎన్నికల్లో నిలబడతామంటూ ఆర్భాటం చేసి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోతోంది జనసేన. చాలా తెలివిగా వ్యవహరించి టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా నిలిచింది. పవన్ కూడా ఎన్నికల్లో దిగకపోయి ఉంటే బాగుండేదంటూ అభిమానులు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. మరోవైపు బీజేపి అసలు పవన్ ను కేర్ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. JSP