తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో మాదిరి టిక్కెట్ల విషయంలో ఏమాత్రం నాన్చడం లేదు. తన పద్ధతిని మార్చుకున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని భావించి ఆయన త్వరత్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమించినా సర్వేల్లో వారికి టిక్కెట్ ఇస్తే గెలుపు కష్టమని తేలడంతో ప్రత్యామ్నాయ నేతల వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా తన శైలిని మార్చుకున్నారు.
ఎన్నికలకు సమయమున్నా….
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. పొత్తులు కూడా ఈసారి ఉండే అవకాశముంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు దాదాపు ఖరారయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాత్రం ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే నేతలను టీడీపీ చీఫ్ సన్నద్ధం చేస్తున్నారు. జనసేనతో పొత్తును పక్కన పెట్టి తమ పార్టీకి చెందిన నమ్మకమైన, అవసరమైన నేతలను ముందుగానే ఎంపిక చేస్తున్నారు. జనసేన అవునన్నా కాదన్నా… చంద్రబాబు మాత్రం తాను అనుకున్న విధంగానే ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులను మార్చి కొత్త వారిని నియమించారు.
నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా…
నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణను చంద్రబాబు నియమించారు. ఇప్పటి వరకూ పార్టీ బాధ్యతలను నిర్వహించిన శ్రీనివాసులురెడ్డిని తప్పించి నారాయణను ఇన్ఛార్జిగా నియమించడం చర్చనీయాంశమైంది. శ్రీనివాసులురెడ్డి పార్టీ కార్యవర్గంలోకి తీసుకున్నారు. గత ఎన్నికల్లోనూ నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి జనసేనతో పొత్తులో ఉండటంతో ఖచ్చితంగా గెలుపు సాధ్యమని భావించిన చంద్రబాబు నారాయణను అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇకపై నెల్లూరు సిటీ ఇన్ఛార్జి బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది.
ఎస్ కోట నుంచి…
అలాగే విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఇన్ఛార్జిని కూడా చంద్రబాబు మార్చారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎస్కోట టిక్కెట్ను ఆశిస్తున్న ఎన్ఆర్ఐను తప్పించి చివరకు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికే టిక్కెట్ చంద్రబాబు కన్ఫర్మ్ చేసినట్లు తెలిసింది. కోళ్ల లలిత కుమారి సుదీర్ఘంగా పార్టీ కోసం పనిచేస్తుండటంతో ఆమెకే టిక్కెట్ కూడా కన్ఫర్మ్ కానుంది. సర్వే నివేదికల ప్రకారం కోళ్ల లలితకుమారి అయితేనే ఎస్ కోట నుంచి గెలిచే అవకాశాలున్నాయని భావించిన చంద్రబాబు ఆ టిక్కెట్ను కూడా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో కోళ్ల లలిత కుమారికి చెందిన వర్గం హ్యాపీగా ఉంది.
బాబు మారారంటూ…
దీంతో పాటు కర్నూలు జిల్లాలోనూ భారీ మార్పులు చేపట్టారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీటీ నాయుడును నియమించినట్లు తెలిసింది. ఈయన నియామకంతో బోయ కులానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఇటీవల కప్పట్రాళ్ల కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో బోయ సామాజికవర్గానికి చెందిన బీటీ నాయుడును నియమించారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గౌడ్ ను నియమించిన చంద్రబాబు బీసీ కార్డుతో ఈసారి కర్నూలులో అధిక సంఖ్యలో సీట్లను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇలా చంద్రబాబు గతానికి భిన్నంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పొత్తులు ఖరారు కాకముందే తమకు పట్టున్న వంద నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాబు మారారంటూ తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడి పోతున్నారు.
Follow Us On : YouTube , Google News