అంతర్జాతీయ మ్యాచ్లో చేసిన తొలి ఫిఫ్టీని క్యూట్ బేబీకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంకితం చేశాడు. వెస్టిండీస్తో నిన్న జరిగిన రెండో టీ 20 మ్యాచ్లో తిలక్ వర్మ యాభై ఒక్క పరుగులు చేశాడు. ఇది అంతర్జాతీయ మ్యాచ్లోనూ, టీ 20లో తొలి అర్థ శతకం. దీంతో తిలక్ వర్మ భావోద్వేగానికి గురయ్యాడు. హైదరాబాదీ కుర్రాడు ప్రతిభను ప్రపంచమంతా పరిశీలించింది.
సొగసైన షాట్లతో…
తిలక్ వర్మ కొట్టే సొగసైన షాట్లు అతడిని అంతర్జాతీయ మ్యాచ్లోకి అరంగేగ్రం చేశాడు. ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరుపున ఆడి నిలకడ కలిగిన ఆటగాడిగా తిలక్ వర్మ పేరు పొందాడు. ఐపీఎల్లోనూ అత్యధిక పరుగులు చేసి ముంబయి ఇండియన్స్ మేనేజ్మెంట్ ను మాత్రమే కాకుండా కెప్టెన్ రోహిత్ శర్మ మనసును కూడా దోచుకున్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే తిలక్ వర్మకు అంతర్జాతీయ మ్యాచ్లలో చోటు లభిస్తుందని అందరూ అంచనా వేశారు. అంచనాలకు అనుగుణంగానే తిలక్ వర్మకు వెస్టిండీస్ తో జరిగే టీ 20 మ్యాచ్లలో ఆడే అవకాశం లభించింది.
అత్యధిక పరుగులు…
వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్ లో 39 పరుగులు చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో 51 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్లలోనూ భారత్ ఓటమి పాలయినా తిలక్ వర్మ అత్యధిక స్కోరు చేసిన ఆటగాడుగా నిలిచాడు. ఫోర్త్ డౌన్లో దిగి భారీ సిక్సర్లు, సొగసైన షాట్లతో ఫోర్లు బాది సెలెక్టర్ల మదిని కూడా దోచుకున్నాడు. అయితే అంతర్జాతీయ టీ 20 మ్యాచ్లో తాను చేసిన తొలి ఫిఫ్టీని చిన్నారి సమైరాకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు.
రోహిత్ శర్మ కుమార్తెకు…
సమైరా అంటే ఎవరో కాదు. భారత్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత శర్మ కూతురు. తాను ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఆడుతున్న సమయంలో సమైరాతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. అప్పుడే సమైరాకు తాను ప్రామిస్ చేశానని చెప్పాడు. అందుకే తన తొలి అర్థ సెంచరీని సమైరాకు ఇస్తున్నట్లు ప్రకటించారు. సమైరాతో తాను త్వరలో సంబరాలు కూడా చేసుకుంటానని తిలక్ వర్మ ప్రకటించి చిన్నారి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు.