తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మరింత జోరు మీద సాగుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ లో చేరికల హడావుడి పెరిగింది.. ఖమ్మం జిల్లా రాజకీయ నేత తుమ్మలను (Thummala) ఈసారి బీఆర్ ఎస్ అధినేత పక్కన పెట్టారు. దాంతో ఖమ్మం రాజకీయాలపై తిరుగులేని పట్టున్న తుమ్మల తన దారి తాను చూసుకున్నారు. కాంగ్రెస్ లో చేరి పోటీకి రెడీ అయిపోతున్నారు.పీసీసీ చీఫ్ రేవంత్ తుమ్మలను కలసి ఆహ్వానం పలికిన దగ్గర నుంచి ఇతర కాంగ్రెస నేతలు వరస బెట్టి తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానం పలికారు. పార్టీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తుమ్మల చెబుతున్నా అది కేవలం లాంఛనమేనని తేలిపోయింది. ఈ బుధవారం అంటే సెప్టెంబర్ 6న తుమ్మలనాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ సమక్షంలోనే తుమ్మల కండువా కప్పుకోబోతున్నారు. మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా తుమ్మలను కలసి అభినందనలు తెలిపారు. తుమ్మల నిర్ణయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక తొలిసారిగా నియోజక వర్గానికి వచ్చిన తుమ్మలకు స్థానికుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది.
ఉమ్మడి ఖమ్మం ఓటర్లే కీలకం!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్ల తీరు ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ ఏ పార్టీ హవా కొనసాగితే రాష్ట్రమంతా అదే ఉంటుందన్న భావన ఓటర్లలో నెలకొంది. అంత కీలకమైన ఈ ప్రాంతంలో ఈసారి తుమ్మల, పొంగులేటి లాంటి సీనియర్లంతా కాంగ్రెస్ పక్షాన నిలుస్తుండటంతో బీఆర్ ఎస్ బిత్తరపోవాల్సిన పరిస్థితి.. ఈ చేరికలకు తోడు వైఎస్ తనయ, వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరితే మాత్రం ఖమ్మం జిల్లాను బీఆర్ ఎస్ నేతలు వదులుకోవాల్సిందే. జిల్లా నేత పువ్వాడ అజయ్ ను పిలిపించి కేసీఆర్ స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తున్నా..బీఆర్ ఎస్ కు ఈ ఎన్నిక కష్టమేనని స్పష్ట మవుతోంది.
తుమ్మల వెనక క్యూ కడతారా? (Thummala)
తుమ్మల చేరిక తర్వాత పాలేరు తదితర నియోజక వర్గాల్ల పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే సీనియర్ కావడంతో తుమ్మల ఎక్కడ నుంచి బరిలోకి దిగాలనుకుంటే అక్కడనుంచి దిగేలా ఛాయిస్ ఇస్తారని సమాచారం.
వాస్తవానికి ఖమ్మంలో బీఆర్ ఎస్ బలోపేతానికి తుమ్మల (Thummala) చేసినంత కృషి మరే నేత చేయలేదు. 2018లో తుమ్మల చేరాక దాదాపు ఐదు లక్షల ఓట్లు బీఆర్ ఎస్ కు కలిసి వచ్చాయి.టీడీపీ ఓట్లను బీఆర్ ఎస్ కు అప్పట్లో తుమ్మల మళ్లించగలిగారు. ముగ్గురు సీఎంల దగ్గర చేసిన అనుభవం, అనేక కీలక శాఖలకు మంత్రిగా పని చేయడం,సీనియర్ నేతగా మంచి గుర్తింపు ఉండటం తుమ్మలకు ప్లస్ పాయింట్ అవుతోంది.
సత్తుపల్లి,ఖమ్మం, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మలకు జిల్లాపై చాలా పట్టుంది.దాదాపు పది నియోజక వర్గాలు ఆయన కనుసన్నల్లోనే ఉంటాయి.
అసలు తుమ్మల బీఆర్ ఎస్ లో చేరాక కారు పార్టీ తల రాతే మారిపోయింది.2018 నాటికి కారు పార్టీ బలమైన పార్టీగా రూపు దిద్దుకుంది.
ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలపించుకోవడమే కాదు, కార్పొరేషన్ను తుమ్మల హయాంలోనే టీఆర్ ఎస్ గెలుచుకుంది.
ఓడిపోయాక ముఖం చాటేసిన కేసీఆర్ (Thummala)
గతంలో ఆత్మీయ ఆలింగనం చేసుకుని పార్టీలోకి తీసుకుని పదవి ఇచ్చిన కేసీఆర్ ఓడిపోయాక కనీసం ముఖం కూడా చూసేందుకు ఇష్టపడటం లేదు.
సీనియర్ అయిన తనకు ఈ తరహా ట్రీట్ మెంట్ అందటం తుమ్మలకు సుతరామూ గిట్టటం లేదు. పైకి నేరుగా అసంతృప్తి ప్రకటించకపోయినా లోలోపల కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి రాజకీయాలే కలకాలం నిలుస్తాయని, అవినీతి రాజకీయాలు నిలవబోవనీ తుమ్మల చేసిన వ్యాఖ్యలు గమనార్హం. ఎవరేమనుకున్న సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను మళ్లించి ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని భూముల్లో పచ్చని పంటలు కళ్ల చూడాలన్నది తన లక్ష్యమంటున్నారు తుమ్మల.అప్పుడే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా శెలవు తీసుకుంటానన్నారు తుమ్మల.
కమ్యూనిస్టులు గట్టెక్కిస్తారా?
తుమ్మల కాంగ్రెస్ వైపు అడుగులేస్తుంటే బీఆర్ ఎస్ కమ్యూనిస్టులతో మళ్లీ జత కట్టి ఈ ఎన్నికల్లో ఒడ్డున పడాలని ట్రై చేస్తోంది.
మరోవైపు కేసీఆర్ మీద కోపంతో ఉన్న పొంగులేటి ఆరు నూరైనా బీఆర్ఎస్ కు ఖమ్మంలో ఒక్కసీటు కూడా రానివ్వబోనని శపథం చేస్తున్నారు.
రెండు పార్టీల్లోనూ పరిణామాలు ఇలాఉంటే వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరడం లాంఛనమేననే వార్తలు వినిపిస్తున్నాయి.
షర్మిల పార్టీలో చేరడం సుతరామూ ఇష్టం లేని రేవంత్ రెడ్డి ఆమె పోటీచేయాలనుకున్న పాలేరు నియోజక వర్గం నుంచి తుమ్మలను దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో ఈ చేరికలు ఆ పార్టీకి బలంగా మారతాయా?లేక అధినాయకుల మధ్య సీట్లపంపకం కీచులాటలు పార్టీకి చేటు చేస్తాయా చూడాలి..