హైదరాబాద్ నగరంలో పిడుగులు పడ్డాయి. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తోడు పిడుగులు కూడా పడ్డాయి. రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లో నాలుగవ అంతస్థులో పిడుగుపడింది. అయితే భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సహజంగా పిడుగులు మైదానం ప్రాంతంలో పడతాయంటారు. కానీ నగరంలో పిడుగులు పడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో నగర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
టీవీలు.. ఫ్రిడ్జ్ లు…
పిడుగులు పడటంతో సమీపంలోని భవనాల్లో ఆన్ చేసిన టీవీలు, ఫ్రిడ్జ్ లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. అత్తాపూర్ లోని వాసుదేవరెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. లిఫ్ట్ వైర్లు కూడా కాలి పోవడంతో అనేక అపార్ట్ మెంట్లలో లిఫ్ట్ లు పనిచేయలేదు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేయడంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో ఉన్నా పిడుగులు పడతాయేమోనని భయపడుతున్నారు. అయితే పిడుగులు పడి ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.