(Tiruma)
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఊత కర్రలను ఇస్తుంది. క్రూర జంతువుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ మార్గాన్ని టీటీడీ ఎంచుకుంది. కర్రలతో అదిలిస్తే కొంత వరకూ జంతువుల నుంచి రక్షణ పొందవచ్చని టీటీడీ భావిస్తుంది. వాటిని మారణాయుధాలుగా చూడకూడదని, కేవలం తమను తాము రక్షించుకునే ఊత కర్రలుగా మాత్రమే చూడాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాదిస్తుంది. కర్రలతో చిరుతను తరమగలమా? అవి బెదిరిపోతాయా? అంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రధానంగా ఊత కర్రలతో సాధ్యమేనా? అంటూ మీమ్స్ కూడా కనపడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయాన్ని వెటకారం చేస్తున్నాయి.
నెట్టింట సెటైర్లు… (Tiruma)
అయితే ఇవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కేవలం రక్షణ కోసం తీసుకునే చర్యల్లో భాగంగానే నడక మార్గంలో వచ్చే భక్తులకు వీటిని ఉచితంగా ఇవ్వడంలో తప్పేమిటని టీటీడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల అలిపిరి కేంద్రం వద్దనే ఈ కర్రలు భక్తులకు నేటి నుంచి ఇస్తున్నారు. తిరుమల అంటే పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కొందరు తమ కోర్కెలు తీరాలని నడక మార్గంలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకునేందుకు వీలుంది. ఈ రెండు మార్గాల్లో జంతువులు ఇటీవల కాలంలో దర్శనమిస్తుండటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది. కాలినడకన వచ్చే భక్తులు ప్రాణ భయంతో స్వామి వారి వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
రక్షణ చర్యలు…
ఇటీవల ఒక బాలిక చిరుత దాడిలో మృతి చెందడంతో టీటీడీ అప్రమత్తమై కొన్ని చర్యలు చేపట్టింది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే చిన్నారులకు నడకమార్గంలో ప్రవేశమని, తర్వాత నిషేధమని నిర్ణయించింది. దీంతో పాటు వందమంది భక్తులు గుంపులుగా వెళ్లాలని వారికి సెక్యూరిటీని ఏర్పాటు చేసేందుకు కూడా టీటీడీ ముందుకు వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
బోనులు… ట్రాప్ కెమెరాలు… (Tiruma)
మరోవైపు నడక మార్గంలో అనేక చిరుతలు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో దాదాపు 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోనులను కూడా ఏర్పాటు చేశారు. కేవలం దేవుడిపై భారం వేయకుండా నడకదారిన వచ్చే భక్తులు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే క్రూర జంతువులు ఎటు నుంచైనా వచ్చే అవకాశముంది. నెపాన్ని టీటీడీపై నెట్టకుండా భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. నడక దారిన వచ్చే భక్తులకు ముఖ్యంగా చిన్నారులకు ప్రత్యేకంగా టీటీడీ ట్యాగ్లను కూడా వేస్తుంది. చిన్నారులు తప్పిపోకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ చర్యలతో పాటు మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం బెటర్. లేకుంటే ప్రమాదాల బారిన పడక తప్పదంటున్నారు అటవీశాఖ సిబ్బంది. మొత్తం మీద నేటి నుంచి నడకదారిన వచ్చే భక్తులకు ఊతకర్రలను టీటీడీ ఇవ్వడం రక్షణ చర్యల్లో ఒక ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది తప్ప ఎటువంటి సెటైర్లు వేయకపోవడమే మంచిది. (Tiruma)