తిరుమల దేశంలో అతి పెద్ద పుణ్యక్షేత్రం. తిరుమలలో కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు. నిత్యం తిరుమల కొండ రద్దీగా ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది.
మొక్కులు చెల్లించకునేందుకు…
అయితే కొందరు భక్తులు వివిధ రూపాల్లో స్వామి వారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. కొందరు తలనీలాలు సమర్పించుకుని భక్తి ప్రపత్తులు చాటుకుంటుండగా, కొందరు కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. చెప్పులు లేకుండా కాలినడకన కొండ ఎక్కుతానని మొక్కుకున్న భక్తులు వారి కోరికలు తీరిన వెంటనే తిరుమలకు వస్తారు.
నడకదారిన…
కాలినడకన వచ్చే భక్తులకు అటవీ జంతువుల నుంచి బెడద ఎక్కువగా ఉంటుంది. పులులు, ఎలుగుబంట్లు కాలి నడక మార్గంలోకి వస్తుండటంతో భక్తులు భయపడిపోతున్నారు. తాజాగా తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి కనిపించింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ఈ ఎలుగుబంటి కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా అడవి నుంచి జంతువులు కాలిబాట మీదకు వస్తుండటం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఒక చిరుత చిన్నారిని ఎత్తుకుపోయి పడేసిన ఘటనను మరవక ముందే ఎలుగుబంటి ప్రత్యక్షమవ్వడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.