తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు జరగనున్నాయి. ఈరోజు ఇటీవల సంభవించిన వరదలపై చర్చ జరగనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు పొంగడం, ప్రాజెక్టులు పొంగి ఊళ్ల మీద పడి పెద్ద యెత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఇక పంట నష్టం సంగతి చెప్పాల్సిన పనిలేదు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో భారీగా పంటనష్టం జరిగిందని చెబుతున్నారు. పంట, ఆస్తి నష్టం అంచనాలను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
ఒకరిపై ఒకరు….
మరోవైపు కేంద్ర కమిటీ కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వరదల అంశంపై చర్చతో సభ వేడెక్కనుంది. ప్రభుత్వం నుంచి బాధితులకు సరైనా సాయం అందించకపోవడం, వరదల సమయంలో పునరావాస కేంద్రాల్లోనూ సరైన వసతులు కల్పించపోవడం, వరదలు వస్తాయని తెలిసినా ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి వాటిపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అధికార పక్షం సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం వరద సాయం కింద కనీసం పైసా కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణను అధికార పార్టీ ఈ సందర్భంగా హైలెట్ చేయనుంది.