నెల్లూరు అంటే గుర్తుకు వచ్చేది మొదటిగా రుచికరమైన ఫుడ్… ఆ తర్వాత రొట్టెల పండగ. నెల్లూరులో రుచికరమైన ఫుడ్ దొరికినట్లే.. రొట్టెల పండగకు కూడా ప్రాధాన్యత ఉంది. ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటే కోరికలు తీరుతాయని నమ్ముతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి రొట్టెలను దర్గా వద్ద సమర్పిస్తారు. అందుకే రొట్టెల పండగ కోసం ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. దర్గాను ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దారు. అవసరమైన వసతులను కల్పించాలని నిర్ణయించారు.
ఏర్పాట్లు పూర్తి…
అన్ని శాఖల అధికారులు రొట్టెల పండగకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద బారికేడ్లతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులు స్నానాలు చేసేందుకు షవర్లను కూడా ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ రొట్టెల పండగ జరగనుంది. మరుగుదొడ్లను కూడా అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలను ఉంచారు. వర్షం వచ్చినా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పెద్దపెద్ద టెంట్లు ఏర్పాటు చేశారు.
అన్ని వసతులు…
తాగునీటి వసతిని కూడా కల్పించారు. తొలి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. విద్యుత్తు పరంగా ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా స్నానాల ఘాట్ లో గజఈతగాళ్లను నియమించారు. అగ్నిమాపక సహాయ కేంద్రాన్ని కూడా సిద్ధంగా ఉందచారు. ప్రత్యేకంగా పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు కూడా దర్గా వద్దకు వచ్చి ఎప్పటికప్పుడు అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ మీడియాకు తెలిపారు. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ శ్రీవికాస్ లు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.