TS-Elections
తెలంగాణలో దాదాపు రెండు నెలలుగా సాగిన హోరా హోరీ ఎన్నికల ప్రచారానికి ఎట్టకేలకు తెర పడింది. అభ్యర్ధులంతా చివరి సారిగా ఓటరు దేవుళ్లను వేడుకున్నారు… ఒక్కోరు ఒక్కో రీతిలో… బతిమాలుకుంటున్నారు. మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించండి అని ఒకరు… ఈ ఒక్కసారికి ఒక అవకాశం ఇవ్వండి అని మరొకరు, సుస్థిర పాలన, అభివృద్ధి పథకాలు ఇలా ఒక్కో పార్టీ ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ తమ తమ ఆఖరి ప్రచారాన్ని రక్తి కట్టించారు. సాయంత్రం ఐదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మైకులు మూగబోయాయి. ఇన్నాళ్లూ పాటలతో, ప్రచారంతో హోరెత్తిన వీధులు ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయాయి. ఇక సైలెంట్ గా పంచుడు కార్యక్రమాలు షురూ అవుతాయి.
ఎవరి వాగ్దానాలు వారివే… TS-Elections
సీఎం కేసీఆర్ ధరణి, రైతు బంధు లాంటి పథకాలను ప్రస్తావించి ప్రచారం చేస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ముందుకొచ్చింది. ఇక బీజేపి సుస్థిర పాలన లాంటి నినాదంతో పాటు కాంగ్రెస్ ను ,బీఆర్ ఎస్ ను విమర్శించడానికే పరిమితమైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చాలా చిత్రవిచిత్రమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఈటల, కేసీఆర్, రేవంత్ ఇలా మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు రెండేసి నియోజక వర్గాలనుంచి పోటీ చేయడం ఒక విశేషం. ఈసారి కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని గెలుపు తమదేనని ఆపార్టీ ప్రచారం చేసుకుంటొంది. కర్నాటకలో ఐదు హామీలు గెలుపు బాట పట్టిస్తే తెలంగాణ కోసం ఆరు గ్యారంటీలను తీసుకొచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ షరామామూలుగానే సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది. ఎటుండె తెలంగాణ నేడెట్లయ్యింది అంటూ పదేళ్ల ప్రగతిని ఏకరవు పెడుతోంది. ఇక బీజేపి షరామామూలుగానే హిందూత్వ అంశంతోనే ప్రచారం చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ లను విమర్శిస్తూ ముందుకు సాగింది. ఈ ఎన్నికల్లో బీజేపి అతిరథ మహారథులైన మోడీ, అమిత్ షా, యోగీ, నడ్డా తదితరులంతా ప్రచారం చేయడం ఒక ఎత్తు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బీజేపి తరపున ప్రచారం సాగించారు.
గెలిస్తే జైత్రయాత్ర… లేకుంటే శవయాత్ర
ఇన్నాళ్లూ ప్రచారం ఒక ఎత్తయితే చివరి గంట ప్రచారమూ ఓ ఎత్తు. సిరిసిల్ల ప్రజలకు భావోద్వేగపు వందనం చేసిన కేటీఆర్ ఈజన్మకు రుణం తీర్చుకోలేనని, సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతోనే అసెంబ్లీలోకి తొలిసారి అడుగు పెట్టాననీ చెప్పుకొచ్చారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ హుజూరాబాద్ ప్రజలను కోరారు. డిసెంబర్ మూడున గెలిస్తే విజయయాత్రకు వస్తానని లేకుంటే శవయాత్రకు రావాల్సి ఉంటుందని సెన్సేషనల్ కామెంట్లు చేశారు కౌశిక్.
మార్పు కావాలి… కాంగ్రెస్ రావాలి
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ ఎస్ తో పోటీగా నిలబడింది. ప్రచార గడువు ముగుస్తున్న తరుణంలో అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశమిచ్చారు. తెలంగాణ ప్రజలు నా మనస్సుకు దగ్గరగా ఉంటారు. ప్రచారానికి రాలేకపోయాను. తెలంగాణ ప్రజల కలలు సాకారం అయ్యేందుకు కాంగ్రెస్ కు ఓటేయ్యండి. మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేయండి అని పిలుపునిచ్చారు సోనియా. కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేయడానికి కారణం చెప్పారు. గజ్వేల్ ను హస్తగతం చేసుకున్న కేసీఆర్ కళ్లు ఇప్పుడు కామారెడ్డిపై పడ్డాయని, గెలిపిస్తే వేల ఎకరాలను కబ్జా చేస్తారంటూ రేవంత్ దుయ్యబట్టారు. కేసీఆర్ కబంధ హస్తాలనుంచి కామారెడ్డిని కాపాడేందుకే తాను అక్కడనుంచి కూడా బరిలోకి దిగినట్లు చెప్పుకొచ్చారు.
రెండు చోట్లా గెలుపే అజెండా TS-Elections
ఇక హుజూరాబాద్ లో పోటీలో ఉన్న ఈటల గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించడమే తన అజెండా అంటున్నారు. తన సొంత నియోజక వర్గంలో గెలుపు ఖాయమని గజ్వేల్ లో ఈసారి కేసీఆర్ మట్టి కరవడం ఖాయమనీ అంటున్నారు. ఇలా నేతలంతా ఒకరిపై ఒకరు ప్రచారాస్త్రాలు సంధించుకుని వేడి పుట్టించారు.ఈ ఎన్నికల్లో కొందరు ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారు. బీఎస్ పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బరిలో ఉన్నారు. మరోవైపు నిరుద్యోగ యువత గళం వినిపిస్తానంటూ బర్రెలక్క అలియాస్ శిరీష అనే యువతి ఎన్నికల్లో నిలబడం సంచలనంగా మారింది.
ఇప్పటికే రెండు సార్లు గెలిచి ముచ్చటగా మూడోసారి గెలిచి హాట్రిక్ సాధించాలని కేసీఆర్ ఉవ్విళ్లూరు తుంటే, కాంగ్రెస్ గెలిచి సీఎం అవ్వాలని రేవంత్ కలలు కంటున్నారు. పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లోనూ గెలిచి బీజేపీలో తన పట్టును నిలుపుకోవాలని ఈటల రాజేందర్ తపన పడుతున్నారు.