నిజామాబాద్ పసుపు (Turmeric) బోర్డు ప్రతీ ఎన్నికల టైమ్ లోనూ తెరమీదకొచ్చినట్లే ఈసారి కూడా మళ్లీ చర్చకు తెర లేపింది. కేంద్రం ప్రత్యేకంగా పసుపు బోర్డు కేటాయిస్తామంటూ మోడీ ప్రభుత్వం తొలిసారి ఎన్నికైనప్పటినుంచి ఊరిస్తూనే వస్తోంది. ఈ ప్రాంత ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇదే మాటిచ్చి రెండుసార్లు సునాయాసంగా గెలిచేశారు. ఇదే హామీ ఇచ్చి ప్రస్తుత ఎమ్మెల్సీ కవితను కూడా ఓడగొట్టారు. కానీ పసుపు బోర్డు మాత్రం రాలేదు.దక్షిణాదిన సుగంధ ద్రవ్యాలకోసం తమిళనాడులో ఉన్న బోర్డు పరిధిలోకే పసుపును కూడా చేరుస్తున్నట్లు ఓ మొక్కుబడి ప్రకటన మాత్రం చేశారు. అయితే పసుపు పంటకు ప్రత్యేక స్థానం కలిగిన నిజామాబాద్ జిల్లా..నాణ్యమైన పసుపు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇక్కడ మెజారిటీ ఎకరాల్లో పసుపు పంటను రైతులు విస్తారంగా వేస్తారు. అలాంటి పసుపుకు నిజామాబాద్ కేంద్రంగానే ప్రత్యేక పసుపు బోర్డు పెట్టాలన్నది స్థానికుల డిమాండ్. ప్రతీ ఏటా ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఈ పసుపు రాజకీయం తెరమీదకొస్తోంది. వల్లమాలిన హామీలు గుప్పించి బీజేపి గెలిచేస్తోంది. కానీ చివరకు స్థానిక రైతుల కళ్లలో పసుపు కొట్టేస్తున్నారు.
ప్రత్యేక బోర్డు ఎందుకు? (Turmeric)
పొగాకు, మిర్చిలకు ప్రత్యేక బోర్డు ఉన్నట్లే పసుపు (Turmeric) పంటకు కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తే మరింత ఏకాగ్రతతో మరింత దిగుబడి సాధించేలా ప్రణాళికలు వేసుకుని పసుపు పంటను పండించవచ్చు. పంట సాగు విస్తీర్ణాన్ని నియంతించడమేకాదు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధరను అమలు చేసేందుకు వీలుంటుంది. అలాగే పసుపు సాగు చేసే రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేలిమి రకం పంటను తీసే ఆస్కారముంటుంది. నాణ్యమైన పసుపు దిగుబడిని సాధించడానికి రైతులకు మెళకువలు నేర్పించే వీలుంటుంది. పసుపు బోర్డు పెడితే అసలు పంట సాగు నుంచి చివరకు మార్కెట్ కు తరలించే వరకూ అంతా పసుపు బోర్డు పరిధిలోనే సాగుతుంది. అందుకే ఈ బోర్డు ఏర్పాటు చేస్తే తమకి ఏలాంటి నష్టం ఉండదని పైగా అనేక ప్రయోజనాలు ఉంటాయని రైతులు చెబుతున్నారు.
2014నుంచి పసుపు రాజకీయం (Turmeric)
దేశవ్యాప్తంగా సాగయ్యే పసుపులో 80 శాతం నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లోనే సాగవుతుంది.అందుకే నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డు పెట్టాలన్నది స్థానిక రైతుల డిమాండ్.
2014 ఎన్నికలలో పసుపు (Turmeric) బోర్డు ఏర్పాటు హామీతోనే బీజేపి ఎన్నికలకు వెళ్లింది.గెలిచాక ఆ హామీని నిలబెట్టుకోలేదు. 2019 ఎన్నికల్లో కూడా మళ్లీ అదే హామీతో ధర్మపురి అర్వింద్ ఎన్నికల్లోకి దిగారు.
అయితే హామీ నిలబెట్టుకోలేదన్న కడుపు మంటతోస్థానిక రైతులు అర్వింద్ కు పోటీగా పెద్ద ఎత్తున ఎన్నికల్లో పోటీకి దిగారు. అంతేకాదు మోడీ నియోజక వర్గమైన వారణాసికి వెళ్లి అక్కడ కూడా నామినేషన్లు వేశారు. అయినా పసుపు బోర్డు విషయం పై కేంద్రం ఉలకదు.. పలకదు..
నిజమా? రూమరా?
తాజాగా ఇప్పుడు మరోసారి పసుపు బోర్డు ఏర్పాటు తధ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇవి రూమర్లా లేక నిజమా అన్నది క్లారిటీ ఇచ్చే నాథుడు కనిపించడం లేదు. ఎంపీ అర్వింద్ నోటమ్మట దీనిపై ఇంకా క్లారిటీ లేదు.
ఈనెల 17న దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తారని, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెడతారనీ అంటున్నారు. ప్రత్యేక పసుపు బోర్డు ఖాయమేనని ప్రధాని మోడీ లేదా అమిత్ షా ఇద్దరిలో ఎవరో ఒకరు నిజామాబాద్ లో పర్యటించడం ఖాయమని, ఈ విషయాన్ని వారే స్పష్టంగా రైతులకు చెబుతారనీ స్థానిక బీజేపి లీడర్లు ప్రచారం చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో.. కాలమే తేల్చాలి.