12
ఓ వైపు చట్ట సభల్లో నిర్ణయాధికారం కోసం పోరాటం జరుగుతుంటే.. మరోవైపు మహిళల మాన, ప్రాణాలకే విఘాతం కలిగించే సంఘటనలు ఎదురవుతున్నాయి. మానసిక స్థితి సరిగా లేని ఓ 12 ఏళ్ల బాలిక కామాంధుల బారిన పడి గాయాలపాలై రక్షణ కోసం దీనంగా అర్ధిస్తూ రోడ్ల వెంట అడుక్కుంటూ వెళుతున్న దృశ్యాలు మనసున్న ప్రతీ ఒక్కరినీ కలవర పెడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ ఉజ్జయినీ లో ఓ 12 ఏళ్ల బాలిక రక్తమోడుతూ.. అర్ధనగ్న స్థితిలో తనకు సాయం చేయమంటూ గడప గడపనూ అర్ధిస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
దీనంగా సాయం కోరుతున్న ఆ బాలికను ఆదుకోవాల్సింది పోయి వింతగా నోరెళ్ల బెట్టి చూడటం స్థానికుల రాతి గుండెలను తెలియ చేస్తోంది. ఓ వ్యక్తయితే బిచ్చగాడిని ట్రీట్ చేసినట్లు పైకి పొమ్మంటూ చీత్కరించుకోవడం కలచి వేస్తోంది.
చిన్న పిల్లలు, మహిళలపై అకృత్యాలు, హింస, దాడులు కామన్ అయిపోయిన ఈరోజుల్లో బహుశా ఈసీసీ టీవీ ఫుటేజ్ దృశ్యాలు మన రాతి గుండె సమాజాన్ని పెద్దగా కదిలించవేమో. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బాద్ నగర్ రోడ్ లో సీసీటీవీ దృశ్యాలలో ఈ హృదయం కదిలించే ఉదంతం కనిపించింది.]
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి 12
ఫుటేజ్ లో కనిపించిన బాలిక ఒంటిపై దుస్తులు అరకొరగా ఉన్నాయి. .. రక్తమోడుతూ…నిస్సహాయంగా రోడ్లపై తిరుగుతున్న బాలిక తనకు సాయపడాల్సిందిగా కనిపించిన వారందరినీ వేడుకుంది. నడిచేందుకు కూడా ఓపిక లేని బాలిక సాయంకోసం చేతులెత్తి వేడుకున్నా అక్కడి వారి గుండె కరగలేదు. అలా గడప గడపనూ అర్ధిస్తూ ముందుకు సాగిన బాలిక చివరకు ఓ ఆశ్రమానికి చేరుకుంది. ఆమెను చూసిన ఓ పూజారి ఆమెపై లైంగిక దాడి జరిగిందని గుర్తించాడు. ఆమెను ఒక టవల్ తో కప్పి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించాడు. వైద్యుల పరిశీలనలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు రూఢీ అయ్యింది. తీవ్రంగా రక్తం పోయి , ఒంటినిండా గాయాలతో ఉన్న ఆ బాలికను అత్యవసర వైద్య సాయం కోసం ఇండోర్ కుతరలించారు. వైద్యచికిత్స అనంతరం ఆమె పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని తెలుస్తోంది.
కేసు నమోదు
అసలేం జరిగిందని పోలీస్ అధికారి ఆమెను ఆరా తీయగా ఆమె తన పేరు గానీ,అడ్రస్ గానీ చెప్పలేకపోతోంది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన రేప్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
బాలికపై దాడికి పాల్పడిన కామాంధులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ను కూడా ఉజ్జయిని పోలీస్ అధికారి సచిన్ శర్మ ఏర్పాటు చేశారు. బాలిక వైద్య పరీక్షలు ఆమెపై రేప్ జరిగినట్లు తేల్చాయి.
దీనిపై ప్రజలకు ఏదైనా సమాచారం తెలిస్తే చెప్పాలని, ఈ దారుణ ఘటన దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బాలికపై ఏ ప్రాంతంలో దాడి జరిగిందన్నది ఇంకా తెలీటం లేదు. తన పేరు గానీ, తానే ప్ర్రాంతానికి చెందినదో సైతం ఆమె చెప్పలేకపోతోందని కానీ ఆమె భాష చూస్తూ యూపీ ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన బాలికగా అనిపిస్తోందని పోలీస్ అధికారి తెలిపారు.
మహిళల పై నేరాల్లో ముందు వరుసలో మధ్యప్రదేశ్
2019-2021 మధ్య కాలంలో మధ్యప్రదేశ్, యూపీలలో పెద్ద సంఖ్యలో మహిళల అదృశ్యం ఘటనలు చోటు చేసుకున్నాయని రికార్డులు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ లో దేశంలోనే ఎక్కువ రేప్ కేసులు నమోదయ్యాయి. వీటో 50 శాతం నేరాలు మైనర్లపై జరిగినవే. అంటే రోజుకు సగటున 18 రేప్ లు జరిగినట్లు లెక్క. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపి ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ తరహా నేరాలు పెచ్చరిల్లుతున్నాయి.