uttarakhand tunnel
పది రోజులుగా టన్నెల్ లో చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న ఉత్తరాఖండ్ కూలీలకు ఇవాళ చిన్న ఉపశమనం దొరికింది.. వారిని చూసేందుకు టన్నెల్ లోకి చేసిన చిన్న రంథ్రం ప్రయోగం విజయవంతమైంది. ఆ రంథ్రం ద్వారా ఎండోస్కోపీ కెమెరా వైర్ ను పంపడం వల్ల కూలీల ముఖాలు బయటకు కనిపిస్తున్నాయి. వారికి ఆ చిన్న మార్గంలోంచే నీళ్లు, ద్రవ పదార్ధాలు పంపుతున్నారు. బాధితులంతా సురక్షితంగానే ఉన్నామని, త్వరగా బయటకు తీసుకు రమ్మని వేడుకుంటున్నారు. అయతే వారిని బయటకు తీసుకు రావడం చాలా క్లిష్టమైన పని అంటోంది డిజాస్టర్ మేనేజ్ మెంట్. ఎంత టైమ్ లోగా వారిని బయటకు తెస్తారన్న ప్రశ్నకు ఆ టీమ్ పెదవి విరుస్తోంది. అది చిన్న విషయం కాదని, మార్గాలను అన్వేషిస్తున్నామని ఆ టీమ్ చెబుతోంది. ఇప్పటికే టన్నల్ దగ్గర సహాయక బృందాలు షిప్టుల వారీగా నిరంతరం శ్రమిస్తున్నాయి. టన్నెల్ బయటనుంచి ఓ మైక్రో బోరింగ్ మిషన్ ను లోపలకు గ్రిల్ చేస్తున్నారు. అయితే అది ప్రమాదంతో కూడుకున్నది. ఏ మాత్రం తేడా వచ్చినా టన్నెల్ కుప్పకూలితే లోపల కూలీలు బతికే అవకాశం ఉండదు.
బ్లాస్టింగ్ తో ముప్పు
టన్నెల్ ముఖ భాగాన్ని వెడల్పు చేయాలంటే దానిని బ్లాస్టింగ్ చేయాలి. ఇప్పుడున్న కండిషన్లో బ్లాస్టింగ్ చేస్తే మొదటికే మోసం వస్తుందన్న భయం అధికార్లను వెంటాడుతోంది. దాదాపు పది రోజులుగా కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిని వెలికి తీయడం ఆలస్యం అవడం వల్ల నష్టం ఉండదని కానీ, ఆందోళనతో ప్రయత్నాలు వేగవంతం చేస్తే ప్రమాదం తలెత్తుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి టన్నెల్ లోపల తగినంత నీరు, ఆక్సిజన్ ఉన్నాయి. టన్నెల్ లోకి కరెంట్ పంపుతున్నారు. అలాగే వారికి ఆహారం కూడా ఎప్పటికప్పుడు పంపుతున్నారు.
బంధువులతో మాట్లాడించిన అధికారులు uttarakhand tunnel
టన్నెల్ లోపల చాలా విశాలంగా ఉంది. దాదాపు రెండు కిలోమీటర్ల స్థలం ఉంది. వెలుతురు కూడా ఉంది. నాలుగు అంగుళాల పైప్ కనెక్షన్ ఉండటంతో అందులోంచే వారికి ఆహారాన్ని పంప్ చేస్తున్నారు. ఇంకా కూలీలకు కావలసిన మందులు కూడా లోపలికి ప్రెషర్ మెకానిజం ద్వారా పంపుతున్నారు. కూలీల మానసిక ఆరోగ్యం కోసం వారి బంధువులు, కుటుంబ సభ్యులను టన్నెల్ దగ్గరకు రప్పించి వారితో మాట్లాడిస్తున్నారు. ఆ కుటుంబాలకు టన్నెల్ సమీపంలోనే హోటళ్లలో వసతి సౌకర్యం కల్పించారు. వారిలో కొందరు లోపలి కూలీలతో నేరుగా సంభాషించారు కూడా. కుటుంబ సభ్యులతో మాట్లాడటం వల్ల లోపల చిక్కుకున్న కూలీలు చాలా సంతోషించారు.
పది రోజుల క్రితం ప్రమాదం
చార్ థామ్ ప్రాజెక్టులో భాగమైన సిలక్యారా,దందల్గావ్ లను కలిపేందుకు ఈ టన్నెల్ ను బ్రహ్మకాల్, యమునోత్రీ నేషనల్ హై వే లో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ టన్నెల్ లోపల కూలీలు పనిచేస్తున్న టైమ్ లోనే పాక్షికంగా కుప్పకూలి మూసుకుపోయింది. దాదాపు పదిరోజులుగా టన్నెల్ లో చిక్కుకున్న కూలీలంతా టన్నెల్ కూలిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. కూలీలకు సన్నటి పైప్ లైన్ ద్వారా ఆహారం అందిస్తూ వచ్చిన అధికార యంత్రాంగం , నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాల వల్ల కాస్త వెడల్పైన పైప్ లైన్ ను లోపలకి అమర్చ గలిగారు. దాని ద్వారా వేడి ఆహారం కూడా లోపలికి పంపగలుగుతున్నారు. సీసాలలో కిచిడీ నింపి వారికి పంపారు.
నిరంతర ఆటంకాలు
కూలీలను వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు 40 మీటర్ల రాయి అడ్డొచ్చింది. దానిని కట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరింత రాళ్లు, శిథిలాలు రాలుతుండటంతో అధికారులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. రాయిని తొలిచేందుకు వినియోగించిన మిషన్లు సైతం విరిగిపోయాయి.దాంతో మరో మిషన్ ను తెప్పించారు. ఇప్పుడు మెయిన్ టన్నెల్ కు కుడి, ఎడమ వైపున రెండు చిన్న టన్నెల్స్ ను డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. ఈప్రక్రియ కోసం అయిదు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. పరిస్థితిని అంతర్జాతీయ టన్నెల్ నిపుణుల బృందం పరిశీలిస్తోంది.