జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ మాటలు మరీ చిత్రంగా ఉంటాయ్.. ఆయనకు కలలు వస్తుంటాయా? లేక భవిష్యవాణి ఏదైనా తెలుసా అనే అనుమానాలు కూడా ఒక్కోసారి కలుగుతుంటాయ్.. వారాహీ యాత్ర నాల్గో విడత సందర్బంగా ఆయన చేసిన కామెంట్లు కాస్త అతిశయోక్తిగా కనిపించాయ్.. పెడనలో తన వారాహి యాత్రపై వైసీపీ నేతల రాళ్ల దాడి జరగొచ్చని ,రక్త పాతం సృష్టించ వచ్చనీ అందుకు కుట్ర పన్నుతున్నట్లు తనకు సమాచారం అందిందనీ పవన్ చెప్పారు. పవన్ ఇలా చెప్పారో లేదో ఆయనకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు ఇచ్చారు. దాడులు జరుగుతాయనే సమాచారం మీకు ఎక్కడనుంచి వచ్చింది? వివరాలు చెప్పండంటూ నోటీసులిచ్చారు… దీనికి పవన్ నుంచి నో ఆన్సర్… (PK)
ప్రతీ యాత్ర ముందు ఒక్కో మాట (PK)
వారాహీ యాత్ర మొదలు పెట్టిన ప్రతీసారీ పవన్ ఇలా ఏదో ఒక కామెంట్ వదులుతుంటారు. గతంలో వారాహీయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు వచ్చినప్పుడు అక్కడ సీమ ఆకు రౌడీల ముఠా దిగిందని, 50 మందిని ఊచకోత కోసేస్తారని తద్వారా అల్లర్లు సృష్టించి తన యాత్రను అడ్డుకుంటారనీ మాట్లాడారు. కానీ పవన్ చెప్పినట్లు ఒక్క దాడి కూడా జరగ లేదు.. చూడబోతే పవన్ సెన్సేషన్ కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా లేక మిత్ర పక్షమైన టీడీపీని ఫాలో అయి అంగళ్లు రభసను పెడనలోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారా? అర్ధం కావడం లేదు. అంతేకాదు.. ఏ విషయమైనా కేంద్రంతో లింకు పెట్టి మాట్లాడుతుంటారు. మోడీ నుంచి అమిత్ షా వరకూ తనకు స్నేహితులనీ, తన దగ్గర చాలా విషయాలు ప్రస్తావిస్తుంటారని అలవోకగా చెప్పేస్తుంటారు.
సచివాలయ వ్యవస్థ పైనా విసుర్లు
ఆ మధ్య గ్రామ వాలంటీర్లు మహిళలను మాయం చేస్తున్నారంటూ ఓ పెద్ద బండ పడేశారు సచివాలయ వ్యవస్థ మీద. పైగా ఆ వార్త తనకు కేంద్ర ఇంటెలిజెన్స్ వారి నుంచి సీక్రెట్ గా చేరిందని మరీ కలరింగ్ ఇచ్చారు. మహిళల అదృశ్యం అంటే చిన్న వార్త కాదు.. చిన్న విషయం అంతకన్నా కాదు.. ఇలాంటిది జరిగితే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. ఇంత పెద్ద అస్త్రం బీజేపీకి దొరికితే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా ఊరుకుంటుందా? పోనీ, బీజేపీ, వైసీపీ మిలాఖత్ అయిపోయాయి అనుకున్నా.. మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఊరుకుంటాయా?
మన దేశంలో ఆ దౌర్భాగ్య స్థితి ఇంకా రాలేదని అందరికీ తెలుసు..మరి ఇంత కామన్ సెన్స్ లేకుండా పవన్ ఎందుకిలా మాట్లాడుతుంటారు? వైసీపీనుంచి పెద్ద ఎత్తున మాటల దాడి జరిగాక వాలంటీర్లు నా అక్క చెల్లెళ్లు.. వాళ్లని కించపరచడం నా ఉద్దేశం కాదు అంటూ మడమ తిప్పేశారు. ప్రతీసారి పవన్ ఇలా పోసికోలు కబుర్లు ఎందుకు చెబుతున్నట్లు? ఒక్కో యాత్రకు ఒక్కోరకంగా చమక్కులు వదలడం వెనక ఉద్దేశం ఏంటి? తనకూ, తన యాత్రకు హైప్ రావాలనా? పవన్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినా.. అవి ఆయన అవగాహనా లేమిని, రాజకీయ అజ్నానాన్ని బయట పెడుతున్నాయి. ఇలాంటి సెన్సేషనల్ స్టేట్ మెంట్లు ఒకసారి, లేదా రెండు సార్లు అందరినీ ఆకర్షిస్తాయి. కానీ పదే పదే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటే పవన్ ని ఎవరైనా ఎందుకు నమ్మాలి? ఎందుకు ఫాలో కావాలి?
మాటల్లో విషం… అణువణువునా అసహ్యం
వైసీపీ సోదరుల మీద నాకు ద్వేషం లేదు అంటూనే టన్నుల కొద్దీ మాటల విషాన్ని చిమ్ముతుంటారు జన సేనాని. మాటకు ముందు ఆకు రౌడీలు, గూండాలు, ఖబడ్దార్, నా కొడకల్లారా?… నేరగాళ్లు, హీన చరితులు… సీమ గుండా గిరీ, అవినీతి పరులు, అక్రమార్జన పరులు… తిత్తి తీస్తాం… వీళ్లా మనల్ని పాటించేది? జనసేన మిమ్మల్ని ఇక భరించదు… మీ భరతం పడుతుంది… తాట తీస్తాం..అంటూ ఆవేశంతో ఊగిపోతుంటారు… వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. ఎనాడైనా, ఎక్కడైనా రక్తపాతాలు, అరాచకం, అల్లర్లు, సీమ టైపు హింస జరిగాయా? ఈ వ్యవహారం చూస్తుంటే వైసీపీతో ఏదో రకంగా గొడవ పెట్టుకుని దానిని రచ్చ చేసి దాన్నుంచి లబ్ది పొందాలన్నది పవన్ ఉద్దేశమా? తనకు పబ్లిసిటీ రావాలనే ఇలా వైసీపీని కవ్విస్తున్నారా? సినిమాల్లో పవన్ కల్యాణ్ తిరుగులేని స్టార్… కానీ రాజకీయాల్లో కనీసం ఓనమాలు కూడా రాని నేత అని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది.
ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వేస్తున్న తప్పటడుగులు అన్నీ ఆయన అజ్నానాన్ని బయట పెడుతున్నాయి… చెప్పిన మాట మీద స్థిరత్వం లేని పవర్ స్టార్ తీరును ఎండగట్టాలంటే ఎంత టైమ్ అయినా సరిపోదు…విచారించాల్సిన విషయమేమంటే… పవన్ ఇన్నిసార్లు ఇలా మాట్లాడి దొరికిపోతున్నా… వైసీపీ నేతలు వీటిపై గురిపెట్టి పవన్ ను కార్నర్ చేయరు… ఎంతసేపు పవన్ మూడుపెళ్లిళ్లు అంటూ అరిగిపోయిన రికార్డునే మళ్లీ మళ్లీ అరగదీస్తుంటారు. వైసీపీ నేతలు కూడా వ్యక్తిగత నిందారోపణలు మాని, ఇష్యూ బేస్డ్ గా పవన్ పై ధ్వజమెత్తితే రాజకీయం వినసొంపుగా, కనసొంపుగా ఉంటుంది. ఇలా బిలో ద బెల్ట్ కామెంట్స్ కాకుండా అంశాల పరంగా కౌంటర్ ఇవ్వడం మొదలు పెడితే రాష్ట్ర రాజకీయాల్లోల స్వచ్ఛ భారత్ సాధించినట్లే… కానీ ఎన్నికలముందు ఈ గాంధీ మహాత్ముడి రోల్ పోషించడానికి ఏ పార్టీ ముందుకు రాదు… అదే అసలు సమస్య... (PK)