రాజమండ్రి – కొవ్వూరు రైల్వే కం రోడ్డు వంతెనపై రాకపోకలను నిలిపేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఈ వంతెనపై వాహనాలను నిషేధించారు. బస్సులు, లారీలు, లోడున్న వాహనాలు ఈ వంతెనపై వెళ్లేందుకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ మాధవీలత ఆదేశాలు జారీ చేశారు. ఈ వాహనాలన్నీ గామన్ వంతెన మీదుగా వెళ్లాలని కలెక్టర్ కోరారు. పెరుగుతున్న ట్రాఫిక్ తో వంతెన దెబ్బతింటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
బరువైన వాహనాలు…
ట్రాఫిక్ పెరగడంతో పాటు బరువైన వాహనాలు వెళుతుండటంతో రోడ్డు కం రైల్వే వంతెన గడ్డర్లు, డెక్ జాయింట్లు దెబ్బతింటున్నాయన్న రోడ్లు, భవనాల శాఖ సూచనల మేరకు నిషేధం విధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. వంతెనపై నుంచి ఇక కేవలం ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఈ ఉత్తర్వులు అమలులో ఉన్నంత వరకూ వాహనాలు రాకూడదని కలెక్టర్ తెలిపారు.