ఊరంతా మునిగిపోయింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. వరుణుడు ఏమాత్రం కరుణించకపోవడంతో నీరు ఏరులై ఊళ్లలో పారుతుంది. దీంతో కొన్ని ఊళ్లు జలమయమయ్యాయి. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ముప్ఫయి సెంటీమీటర్లకు పైగా వర్షం పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా అనేక గ్రామాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు.
కాపాడాలంటూ…
జయశంకర్ భూపాలజిల్లాలోని మోరంచపల్లె దాదాపు మునిగిపోయింది. దాదాపు పదిహేను వందల మంది గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రి నుంచి బితుకు బితుకుమంటూ బతుకుతున్నారు. తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మిద్దెల మీదకు ఎక్కి కొందరు ప్రాణాలు కాపాడుకుంటున్నారు. నీరంతా చేరడంతో ఊరు మునిగిపోయింది. బయటకు వచ్చే అవకాశం లేదు. మొరంచ గ్రామం వద్ద పదిహేను అడుగుల ఎత్తులో వాగు ప్రవమిస్తుండటంతో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
బోట్లు పంపేందుకు…
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ గ్రామానికి బోట్లు పంపుతామని చెప్పారు. గ్రామాల నుంచి ప్రజలను రక్షిస్తామని హామీ ఇచ్చారు. బోట్లు ఇంకా ఆ గ్రామానికి చేరుకోలేదు. “దయచేసి మమ్మల్లి కాపాడండి” వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు హృదయవిదారకరంగా ఉన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. ప్రజలు ధైర్యం తెచ్చుకోవాలని, త్వరలో బోట్లు పంపి ప్రజలను కాపాడతామని అధికారులు చెబుతున్నారు.