విశాఖ సాగర తీరాన అర్ధరాత్రి దాటాక ఫిషింగ్ హార్బర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది ఇంకా బయటపడలేదు. దాదాపు ఒక్కొక్కటి15 లక్షల విలువైన 40 ఫిషింగ్ బోట్లు బూడిద కుప్పలా మారిపోయాయి. అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరగడం వెనక కుట్ర కోణం ఏదైనా ఉందా అనే యాంగిల్ లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా… 40
ముందుగా ఒక బోటులో నిప్పంటుకుందని మిగతా బోట్లకు వ్యాపించకుండా ఉండేందుకు దానిని సముద్రంలో కొంత దూరం తరలించారు. అయినప్పటికీ గాలి వేగం ఎక్కువ ఉండటం, నీటి తరంగాల జోరుకు బోటు జెట్టీకే కొట్టుకొచ్చి మిగతా బోట్లకు మంటలు వ్యాపించాయి. అందువల్లే ప్రమాదం పెద్దదైందని విశాఖ పట్నం పోలీస్ కమిషనర్ తెలిపారు. బోటులో ఉన్న డీజిల్ కంటైనర్లు, గ్యాస్ సిలిండర్ల వల్ల ప్రమాదం మరింత పెరిగి మంటలు వ్యాపించి మొత్తం జెట్టీ ఏరియా మొత్తం మంటల్లో తగులబడిపోయింది.
కుట్రకోణం ఉందా?
ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో నేరగాళ్ల కోణాన్నీ కొట్టి పారేయలేమంటున్నారు మత్య్సకారులు.బోటులో కొందరు అర్దరాత్రి పార్టీ చేసుకున్నారని అదే ప్రమాదానికి దారి తీసిందని వారంటున్నారు. తమ జీవనాధారమైన బోట్లు తగులబడిపోవడం పట్ల మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ కష్టార్జితం అగ్నికి ఆహుతైపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొన్ని బోట్లలో పేలుడు శబ్దాలు రావడం సమీపంలోనే ఇంథన ట్యాంకులు ఉండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్ని ప్రమాదం రాత్రి 11.30 దాటాక జరిగిందని తెలుస్తోంది. బోట్లపై ఉన్న సిలిండర్లు పేలుతుండటం కలవరం కలిగించింది. పైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. ప్రమాదంపై పలు రకాలుగా దర్యాప్తులు జరుపుతున్నారు.
బోటులో పార్టీయే కారణమా? 40
రాత్రి 11.30 దాటాక ఓ బోటులో జరిగిన పార్టీయే ప్రమాదానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఓ యూట్యూబర్ ఓ బోటులో పార్టీ ఇస్తున్నట్లు అదే ప్రమాదానికి కారణమని జాలర్లు చెబుతున్నారు. తాగిన మద్యం మత్తులో గొడవ జరిగిందని,అదే ప్రమాదానికి కారణమని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ యూట్యూబర్ అక్కడినుంచి పారిపోయినట్లు వారు చెబుతున్నారు. మత్య్సకారులు చెపపిన యూ ట్యూబర్ ను గాలించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తునారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీల ద్వారా మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఘటన పొరపాటున జరిగినదా; లేక ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారా అన్న అంశం తేలాల్సి ఉంది.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణం కనుగొనాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో నష్టపోయిన మత్య్సకారులకు తగిన సహాయ , సహకారాలు అందించేందుకు పరిస్థితిని సమీక్షించేందుకు మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పల రాజును జగన్ ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రి అప్పలరాజు విశాఖ అగ్ని ప్రమాదాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.