Vizag harbour fire accident
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో 40 బోట్లు దగ్ధమైన కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చింది. జాలర్లు తాగి పడేసిన ఓ సిగరెట్ పీక అంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారణమైందని విశాఖ పోలీసులు తేల్చారు. వాసుపల్లి నాని, సత్యం అన్న ఇద్దరు నిందితులు అజాగ్రత్తగా వ్యవహరించి, ఈ పెను ప్రమాదానికి కారకులయ్యారని స్పష్టం చేశారు. 19వ తేదీన రాత్రి వీరిద్దరూ బోటులో మద్యం సేవించారని, అందులోకి స్టఫ్ కింద ఉప్పు చేపను కాల్చి తిన్నారని… ఆపై సిగరెట్ తాగారని ఆ పీకను పక్కనున్న బోటుపై పడేశారని పోలీసులు చెబుతున్నారు.
ఈ సిగరెట్ పీక వలపై పడటంతో వల అంటుకుని అది బోటు ప్రమాదానికి దారి తీసిందని మంటలు మిగతా బోట్లకూ అంటుకోడంతో చూస్తుండగానే ప్రమాదం పెద్దదైపోయిందని తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈప్రమాదంలో 40 బోట్లు తగులబడిపోయాయి.. బుగ్గి బుగ్గిగా మారిపోయాయి. ఒక్కో బోటు ఖరీదు 15 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బోట్లపై వేటకెళ్లే మత్య్సకారులు జీవనాధారం పోయి ఇప్పుడు బిక్కు బిక్కుమని చూస్తున్నారు. ప్రభుత్వం అందించే సాయం వారికి ఏ మాత్రం సరిపోతుంది గనక? జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఒక్కొక్కరికీ 50 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.
లోకల్ బాయ్ కి సంబంధం లేదు…
ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ బాయ్ అనే యూట్యూబ్ ఛానెల్ ఓనరైన నాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతగాడు సముద్ర ప్రయాణాలపైనా, జాలర్ల జీవితంపైనా, సముద్రంపైనా అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాడు. నాని తన భార్య గర్భం దాల్చిన సందర్భంగా మిత్రులకు ప్రమాదం జరిగిన రోజు ఓ బోటుపై పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో ఘర్షణ రేగిందని, నానీయే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని మొదట్లో కథనాలు వచ్చాయి. అతగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో తనకే సంబంధమూ లేదని బోరుమన్నాడు..
ఆ రోజు అక్కడకు వచ్చినది వాస్తవమేనని కానీ పార్టీ అక్కడ ఇవ్వలేదని, తాను వెంటనే వెళిపోయాననీ చెప్పుకొచ్చాడు. నాని స్నేహితులను కూడా విచారించడంతో అసలు విషయం బయటపడింది. బోట్ల దగ్గర ప్రమాదం జరిగిందని తెలుసుకుని వచ్చి వీడియో తీసి అప్ లోడ్ చేసినట్లు అతగాడు తెలిపాడు. నానిని పోలీసులు విచారణ సమయంలో చితక బాదినట్లు, అతగాడు ఉన్నదున్నట్లు చెప్పడంతో పోలీసుల దృష్టి స్థానిక మత్య్సకారులపై పడిందనీ తెలుస్తోంది. అప్పుడే అసలు విషయం బయటకొచ్చింది.
తాగి పడేసిన సిగరెట్ పీకతో… నిప్పు Vizag
సిగరెట్ తాగి ప్రమాద వశాత్తూ పడేసిన పీక వలకు అంటుకుని నిప్పు ఎగసి అగ్ని ప్రమాదం జరిగింది. లంగరు వేసిన బోటును మత్య్సకారులు ఈ గందరగోళంలో విప్పేయడంతో గాలి వేగంగా వీచి అది కాస్తా మిగతా బోట్ల దగ్గరకు కొట్టుకొచ్చింది. దాంతో మిగతా బోట్లకు కూడా నిప్పంటుకుంది. అయితే సిగరెట్ పీకను ప్రమాద వశాత్తు పడేశారా లేక ఘర్షణ తర్వాత ఉద్దేశ పూర్వకంగా పడేశారా అన్నది తేలాలి. ఏదైతేనేం కొందరి నిండు జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఈ నష్టం ఇప్పట్లో కోలుకునేది కాదు. చుట్టూ నీళ్లున్నా… మంటలను ఆర్పలేని దుస్థితి.. సముద్రంలోనే మరో బోటుపైనుంచి ఫైరింజన్లతో మంటలనార్పాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. దర్యాప్తు ముగిసి నిందితులెవరో తేలి వారికి శిక్ష పడినా జరిగిన నష్టమైతే పూడ్చలేనిది.
Vizag