వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ వరస విజయాలతో ఊపు మీదుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న టీం ఇండియా ఇక టీ 20 సిరీస్పై కూడా కన్నేసింది. నేడు వెస్టిండీస్ – భారత్ మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టీ 20 సిరీస్ ను నెగ్గుకు రావడం భారత్ కు అంత సులువు కాదన్నది క్రీడా విశ్లేషకుల అంచనా.
బలంగా విండీస్…
టీ 20 లీగ్ లో విండీస్ జట్టు బలంగా ఉంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటంతో భారత్ కు టీ 20లలో విజయం అనుకున్నంత ఈజీ కాదు. నేటి నుంచి టీ 20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి ఎనిమిదిగంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ 20 టీం ఇండియా జట్టులో మార్పులు, చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ కు చోటు దక్కే అవకాశముంది.
కుర్రాళ్లకే ఛాన్స్…
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టులో అదరగొట్టిన తిలక్ కు ఈరోజు మ్యాచ్లో ఆడే అవకాశం రానుందని చెబుతున్నారు. అలాగే యశస్వి జైశ్వాల్ తోా పాటు శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు ఆడే ఛాన్స్ ఉంది. ముఖేశ్ కుమార్ తో పాటు ఉమ్రాన్ మాలిక్ లేదా ఆవేశ్ ఖాన్ లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. మరి తొలి మ్యాచ్ ఎవరి పరమవుతుందన్నది చూడాల్సి ఉంది.