TS Public Pulse
ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాజకీయాలు క్షణానికో రకంగా మారుతున్నాయ్. ప్రజానాడి పట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ తమ గెలుపు గ్యారంటీ అనుకుని అద్దాల మందిరాల్లో ఉండిపోయింది బీఆర్ఎస్…ఆ తర్వాత ఆ మైకం పొరలు వీడి ప్రజాగ్రహం అర్ధమై వాళ్లని ప్రసన్నం చేసుకునే దిశలో వేగంగా అడుగులు వేస్తోంది బీఆర్ ఎస్.. కేసీఆర్ అవినీతి, కవిత లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ను గద్దె దింపుతాయని అంతా భావించారు. ఈ రెండు అంశాల విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బీజేపి ఆవిషయమే ప్రస్తావించకుండా పార్టీ మౌత్ పీస్ గా ఉన్న బండి సంజయ్ ను మార్చేసి తన కొమ్మ తానే నరికేసుకుంది. ఫలితంగా బీఆర్ ఎస్, బీజేపి ఒకటే అనే అభిప్రాయానికి జనం వచ్చారు. లేదా పరిణామాలు అలా అనిపించేలా చేశాయ్.
తీవ్రమైన ఆగ్రహావేశాల్లో యువత TS Public Pulse
ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజు కుంది.. బీజేపి బీఆర్ ఎస్ బీ టీమేనంటూ రేవంత్ చేసిన ప్రచారం, దానికి అనుకూలంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిణామాలు ఆ రెండు పార్టీలూ ఒకటే అనే అభిప్రాయానికి వచ్చేలా చేశాయి. పైగా తెలంగాణ ఓటర్లలో కీలకంగా మారిన యువత కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. గ్రూప్ సర్వీసుల రిక్రూట్ మెంట్లను చేపట్టకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా వేల పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోకపోవడం వారి కోపం కట్టలు తెగేలా చేస్తోంది. ఎంతో ఊరించి ఊరించి చేపట్టిన గ్రూప్ వన్ రిక్రూట్ మెంట్ ను లీకేజీ కాటేసింది. దాంతో అది కాస్తా రద్దయ్యింది. దాంతో నిరుద్యోగులంతా కేసీఆర్ ప్రభుత్వంపై కారాలు , మిరియాలు నూరుతున్నారు.
స్థిర చిత్తంతో రూరల్ ఓటర్లు TS Public Pulse
బీఆర్ ఎస్ కు రూరల్ నియోజక వర్గాల్లో పట్టు చెక్కు చెదర లేదు. కేసీఆర్ స్కీములు, రైతు బంధు, వ్యవసాయానికి సాగు నీరు, 24 గంటల కరెంటు బాగా పనిచేస్తున్నాయి. పట్టణ స్థాయిలో మాత్రం తీవ్రైమన వ్యతిరేకత ఉంది. అయితే అర్బన్ ఎడ్యుకేటెడ్ పోలింగ్ బూత్ లకొచ్చి ఓపికగా నిలబడి తమ వ్యతిరేకతను నమోదు చేస్తారా అంటే సందేహమే.. దీనికి గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలే సాక్ష్యం. అప్పట్లో ఓటింగ్ చాలా చాలా తక్కువగా నమోదయ్యింది.
కేసీఆర్, కేటీఆర్ లకు ఎదురుగాలి?
ఈ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ ల నియోజక వర్గాలలో ఏటికి ఎదురురీదుతున్నారన్నది మరో టాక్. వారి గెలుపు అంత ఈజీగా కాదని పరిణామాలు తెలియ చేస్తున్నాయ్. దీనికి తోడు గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందంటూ పబ్లిక్ టాక్ బాగా వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ అంటే ముఠా తగాదాల పార్టీ అని ద్వేషించే వారు సైతం ఈసారి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇవ్వడం సరైనదనే అభిప్రాయంలో ఉన్నారు.
ఐక్య రాగం పాడుతున్న కాంగ్రెస్
గతంలో చీటికి మాటికి ఢిల్లీ ఫిర్యాదులతో ముఠా తగాదాలతో కునారిల్లిన కాంగ్రెస్ గత నాలుగు నెలలుగా ఒక్క తాటిపై నడుస్తోంది. నాయకుల మధ్య విభేదాలున్నా , అన్నీ పక్కన పెట్టి ఐక్యంగా అడుగులేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ కి వేవ్ రాబోతోందన్న భావన కలుగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితల కుటుంబ పాలనకు చెక్ చెప్పాలని, వారి అహంకారాన్ని నేలకు దించాలని చాలామంది కడుపు రగిలిపోయి ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి కాంగ్రెస్ అధికారం చేపట్టినా ఆశ్చర్యం లేదు. కాకపోతే పరిస్థితిని అంత సులభంగా కేసీఆర్ చేజార్చుకోరు అన్నది ఆయన వ్యవహార శైలి తెలిసిన వారు అంటుంటారు. పైగా డబ్బు ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది ఈసారి. ఒక్క ఓటు ఎన్ని వేలకు అమ్ముడు పోతుందో అంచనా కట్టలేం.. జనం కూడా ఎవరు డబ్బిస్తే.. వారి సంగతి ఆలోచిద్దాం అనేలానే ఉన్నారు. డిసెంబర్ 3న మాత్రమే లక్ ఎవరికి కలిసొచ్చిందో తేలేది.
TS Public Pulse