MP
దివంగత నేత వైఎస్ కు తెలంగాణలో చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉంది. పైగా కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది. ఈరెండు అంశాలనే అస్త్రాలుగా మలిచి పార్టీ పెట్టిన వైఎస్ తనయ షర్మిల పార్టీని నడపడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. పాదయాత్రలు, తండ్రి చరిష్మా, తన కష్టం ఫలించి పార్టీ నిలబడుతుందనుకున్నా.. ఆశించిన స్థాయిలో ఆమెకు స్పందన రాలేదు. వైఎస్ అభిమానుల ఓటు బ్యాంకును ఒడిసి పట్టడంలో వైఎస్ తనయ ఎందుకో సక్సెస్ కాలేకపోతున్నారు. పార్టీ పెట్టి రెండేళ్లయినా, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, నిరుద్యోగ దీక్షనుంచి కాళేశ్వరం అక్రమాల వరకూ ప్రశ్నించినా షర్మిలకు పార్టీలో గట్టి కేడర్ అంటూ రూపొంద లేదు. ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక సందిగ్ధ స్థితిలో ఉన్న టైమ్ లోనే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు గాలం వేసింది.. ఒకప్పుడు తన తండ్రి వల్ల కాంగ్రెస్ కు గుర్తింపు వచ్చింది తప్ప ఆ పార్టీకి అంతకన్నా సీన్ లేదు అని తేల్చేసిన షర్మిల హై కమాండ్ పిలుపుతో మనసు మార్చుకున్నారు.. హుటాహుటిన అనేక సార్లు ఢిల్లీ వెళ్లి సంప్రదింపులు జరిపారు.
ఇద్దరి లక్ష్యం ఒకటే… MP
కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ కి తెలంగాణను సొంతం చేసుకోవాలని ఉంది. దానికి అన్ని వైపుల నుంచి కృషి జరుగుతోంది. రేవంత్ దూకుడు, సీనియర్ల మధ్య ఐక్యత చూస్తుంటే కాంగ్రెస్ ఈసారి చాలా గట్టిగా బీఆర్ ఎస్ ను ఎదుర్కొంటోందని అర్ధమవుతోంది. ఈ యుద్ధంలో షర్మిల లాంటి ఐకాన్ తోడయితే పార్టీకి ప్లస్ అవుతుందని అధిస్టానం భావించి ఉండొచ్చు. దీనికి తోడు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ శివ కుమార్ తో షర్మిలకు బెంగుళూరులోఉన్న టైమ్ నుంచే పరిచయాలు ఉండటం కూడా ఆమె కాంగ్రెస్ వైపు అడుగులేసేందుకు పురికొల్పింది. డీకే షర్మిలతో మంతనాలు జరిపారు. పార్టీ టిక్కెట్ విషయంలో అధిష్టానానికి, షర్మిల్ కు మధ్య డీకే సంధాన కర్తగా వ్యవహరించారు.కేసీఆర్ ను ఇంటికి పంపాలన్నదే ఇద్దరి టార్గెట్.
ప్రతీ సారీ మోకాలడ్డిన రేవంత్ వర్గం?
మొదట్నుంచి షర్మిల పాలేరు పై కన్నేశారు. తాను ఒక్కరూ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టినా చాలని అనుకున్నారు. అందుకే పాలేరు లో ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. పాలేరు నుంచి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని ఆమె కాంగ్రెస్ ను పట్టుబట్టారు. అయితే షర్మిలను ఏపీకి పంపాలని మొదట్నుంచి పట్టుబడుతున్న రేవంత్ వర్గం ఆమెకు పాలేరు దక్కకుండా పావులు కదిపింది. తుమ్మల లాంటి దిగ్గజాన్ని పార్టీలోకి రప్పించడంలో సక్సెస్ అయ్యి పాలేరు టిక్కెట్ ఆయనకు ఇచ్చే కండిషన్ మీద పార్టీలో చేర్చుకుంది. మరోవైపు వైఎస్ అంటే గిట్టని అసమ్మతి వర్గం కూడా ఈ విషయంలో రేవంత్ తో చేయి కలిపింది. వారంతా ఆమెకు అనుకూలమైన సీటన్నది లేకుండా రాజకీయ అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారు. షర్మిల పార్టీలో చేరడం ఇష్టం లేని ఆ వర్గం ఆమెను ఏపీలో వినియోగించుకోవాలంటూ అధిష్టానానికి విన్నపాలూ చేసింది. మరోవైపు ఇటు షర్మిల ఏపీ వెళ్లేందుకు సుతరామూ అనేశారు.. కోరి కోరి అన్న జగన్ తో వైరం ఎందుకనుకున్నారో ఏమో తానుకోరిన సీటు ఇస్తేనే పార్టీ విలీనం అంశం ఉంటుందని తేల్చి చెప్పేశారు. గతనెలాఖరు వరకూ డెడ్ లైన్ పెట్టి ఒక రకంగా హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారు.
ఖమ్మం సీటు విషయంలోనూ అదే రిపీట్ MP
ఈ మధ్యలో పార్టీకి గట్టి పట్టున్న ఖమ్మం నుంచైనా రంగంలోకి దిగాలని షర్మిల ఆశించారు. అయితే ఈసారి రేవంత్ వర్గం రేణుకా చౌదరి ద్వారా షర్మిలకు ఖమ్మం సీటు రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.అలా ఖమ్మం సీటు కూడా షర్మిల చేజారిపోయింది. చివరాఖరుకు ఆమెకు ఓ లోక్ సభ సీటు, పార్టీ నేత ప్రియాంక గాంధీతో సమానంగా కీలక పదవి కట్టబెట్టేందుకు ఒప్పందం కుదిరింది.
షర్మిలను సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పంపాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనకు షర్మిల కూడా దాదాపు ఓకే అనే స్థితిలోనే ఉన్నారు. అయితే సికింద్రాబాద్ సీట్ పై ఆదినుంచి కన్నేసి సర్వీస్ చేసిన కాంగ్రెస్ సీనియర్లు ఈసారి షర్మిలకు మళ్లీ మోకాలడ్డుతారేమో చూడాలి.
రాజీవ్ తనయ ఈక్వల్ టు వైఎస్ తనయ
షర్మిలకు ప్రియాంకా గాంధీతో సమానంగా పార్టీ పదవి ఇవ్వడమంటే చాలా పెద్ద విషయమే.. రాజీవ్ తనయ ఈక్వల్ టు వైఎస్ తనయ అనేంత రేంజ్ లో ఆమెను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంటోంది. మరి పార్టీ ఆశలను షర్మిల ఏ మేరకు నిలబెడతారో చూడాలి. గతంలో వైఎస్సార్టీపీ పాదయాత్రల్లో కాంగ్రెస్ ని చీల్చి చెండాడిన షర్మిల ఇప్పుడు అదే పార్టీకి అనుకూలంగా మాట్లాడటమంటే కొంత ఇబ్బందే మరి..కానీ మంచి వాక్పటిమ, తండ్రి పోలికలు పుష్కలంగా ఉన్న షర్మిల ఈసారి గెలిచి అసెంబ్లీకో, పార్లమెంటుకో వస్తే మంచిదే.. ఇలాంటి ఫైర్ ఉన్న నేతలే ఇప్పుడు కావలసింది.