భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో (WC) క్రమంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఏ జట్లు సెమీస్కు చేరుతాయనే లెక్కలు తెలుతున్నాయి. కొన్ని జట్లు సెమీస్ రేసులో ముందుకు దూసుకుపోతుండగా మరికొన్ని జట్లు వెనకపడ్డాయి. ప్రపంచకప్ ఆరంభంలోనే సెమీస్ బెర్తుల విషయంపై వేడి రాజుకుంది. చివరికి ఎవరు ఆ నాలుగు బెర్తులను దక్కించుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. రేసులో ముందున్న జట్లకు కూడా ఎదురుదెబ్బలు తగిలితే మళ్లీ సెమీస్ రేసు సంక్లిష్టంగా మారనుంది. టీం ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, సెమీస్ దిశగా దూసుకుపోతున్నాయి. మరోవైపు అంచనాలను తలకిందులు చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్,అయిదుసార్లు ఛాంపియన్ గా గెలిచిన ఆస్ట్రేలియా, దాయాది పాకిస్థాన్ సెమీస్ పోరులో కాస్త వెనకపడ్డాయి.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆదివారం జరిగిన ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పటివరకు ప్రపంచకప్లో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. అలాగే పాయింట్ల పట్టికలోనూ టాప్కు దూసుకెళ్లింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇక టీమిండియా చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
సెమీస్ కు ఒక్క మ్యాచ్ దూరంలో భారత్ (WC)
2019 ఎడిషన్లో వర్షం కారణంగా మొత్తం నాలుగు మ్యాచ్లు రద్దయ్యాయి. అయితే ఈసారి అలా జరిగే అవకాశం లేదు. తద్వారా 10 పాయింట్లు సాధించినా భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించలేదు. కాబట్టి, సెమీ-ఫైనల్కు అర్హత సాధించాలంటే ఒక జట్టు కనీసం ఆరు విజయాలు సాధించాలి. రోహిత్ సేన ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. కాబట్టి మరో మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ బెర్తు దక్కుతుంది. ఇండియాకు ఇంకా నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒకటి గెలిస్తే సెమీ ఫైనల్కు చేరుకోవచ్చు. అక్టోబర్ 29న ఇంగ్లాండ్తో, నవంబర్ 2న శ్రీలంకతో, నవంబర్ 5న దక్షిణాఫ్రికా, ఇక చివరిగా నవంబర్ 12న బెంగళూరులో నెదర్లాండ్స్తో తలపడనుంది. నాలుగు మ్యాచ్ల్లో ఒక్క విజయం భారత్కు పెద్ద కష్టమేమీ కాదు. భారత్తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీ ఫైనల్కు అర్హత సాధించడం దాదాపు ఖాయంగా అనిపిస్తుంది. మరి మిగతా రెండు జట్లేవో ఇంకా తెలియాల్సి ఉంది.
సెమీస్ రేసులో కివీస్ కూడా…
సెమీస్ రేసులో భారత్తో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దూసుకెళ్తున్నాయి. ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి, మూడో మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేయడంతో భారత్ ఒక్కసారిగా టైటిల్కు హాట్ ఫేవరెట్గా మారింది. ఇండియా సెమీస్ చేరడం లాంఛనమే కావచ్చు. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ను అలవోకగా ఓడించడంతో న్యూజిలాండ్ కూడా సెమీస్కు ఫేవరెట్ అయింది. ఇంకో పెద్ద జట్టును ఓడిస్తే కివీస్కు మార్గం మరింత సుగమమవుతుంది. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సఫారీ జట్టు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొంది. అంతకంటే ముందు లంకను ఆ జట్టు మట్టికరిపించింది. సఫారీ జట్టు జోరు చూస్తుంటే సెమీస్ బెర్తును వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలతో ఈ ప్రపంచకప్ ఆరంభ దశలోనే ఆసక్తికరంగా మారింది. (WC)